చైనాలో పొంచివున్న మరో ప్రమాదం: పందుల్లో కొత్త వైరస్: అవలీలగా మనుషులకు సంక్రమణ: కరోనా కంటే
బీజింగ్: ప్రపంచంలో అల్లకల్లోలాన్ని రేపుతోన్న భయానక కరోనా వైరస్కు జన్మనిచ్చినట్లుగా అనుమానిస్తోన్న చైనాలో మరో పెను ప్రమాదం పొంచివుంది. కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఈ వైరస్కు ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చైనా పందుల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది మనుషులకు అవలీలగా సంక్రమించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Recommended Video
కరోనా కంటే..
ఇప్పటికే కరోనా వైరస్ వంటి ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది చైనా నుంచే. చైనా హ్యూబే ప్రావిన్స్లో గల వుహాన్లోని ఓ ఫిష్ మార్కెట్ నుంచి కరోనా వైరస్ జన్మించినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కల్లోలాన్ని రేపుతోందనేది ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచపటంలో కనిపించే ప్రతి దేశం కూడా ఈ వైరస్ బారిన పడింది. ప్రాణనష్టాన్ని చవి చూస్తోంది. అమెరికా, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు కుదేలు అవుతున్నాయి దీని ధాటికి.
జీ4గా
ఈ పరిస్థితుల్లో మరో కొత్త వైరస్ చైనాలోనే పుట్టుకుని రావడం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనల్లోకి నెట్టేసింది. కరోనా వైరస్తో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న తరుణంలో చైనా శాస్త్రవేత్తలు, పరిశోధకులు కొత్త వైరస్ విషయాన్ని బహిర్గతం చేశారు. కరోనా తరహాలోనే ఈ వైరస్ కూడా మహమ్మారిలా వ్యాప్తించే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనిపై అమెరికన్ సైన్స్ జర్నల్ ఓ కథనాన్ని రాశారు. జీ4గా గుర్తింపు పొందిన ఈ వైరస్ హెచ్1ఎన్1 నుంచి సంక్రమించినట్లు ప్రాథమికంగా నిర్దారించారు.
మనుషులకు సోకే లక్షణాలు..
మనుషులకు సోకడానికి కావాల్సిన లక్షణాలు దీనికి ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీపీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీ4 ఓ ప్రమాదకరంగా ప్రబలే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. చైనా వ్యవసాయ యూనివర్శిటీ (సీఏయూ) ప్రొఫెసర్ లియు జిన్హువా సారథ్యంలోని ఓ పరిశోధకుల బృందం తొలిసారిగా దీన్ని గుర్తించింది. చైనాలో 10 ప్రావిన్స్ల్లో గల పందుల వధ శాలల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా ఈ వైరస్ జాడ తేలినట్లు తెలిపారు.
చైనా హెల్త్ కమిషన్కు నివేదిక..
సాధారణంగా- పందుల్లో సంక్రమించే వైరస్ మనుషులకు సోకుతుంటుందని, అదే తరహాలో జీ4 కూడా అవలీలగా మనుషులకు సంక్రమించే అవకాశాలు లేకపోలేదని చైనా శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. ఈ కొత్త వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు చైనా జాతీయ హెల్త్ కమిషన్ అధికారులను హెచ్చరించారు. దీనిపై ఓ నివేదిక సైతం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ మహమ్మారిలా మారడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అమెరికా సైతం స్పష్టం చేసింది.
ధృవీకరించిన అమెరికా..
ఈ వైరస్ ఆశ్చర్యకంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థకు చెందిన సెంటర్ ఫర్ పిగ్ ఇన్ఫ్లుయెంజా వైరస్ బయాలజిస్ట్ మార్థా నెల్సన్ తెలిపారు. దీని తీవ్రత ప్రస్తుతం తక్కువ స్థాయిలోనే ఉందని అన్నారు. ఆ సమయంలోనే ఈ వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ తరహాలోనే దీనికి కూడా ఎలాంటి మందులు లేవని చెప్పారు.