చైనా తెంపరితనం: భారత్పై కొత్త అభాండాలు: కరోనా పుట్టింది మన వద్దేనట: యువత ద్వారా వ్యాప్తి
బీజింగ్: ప్రపంచాన్ని చుట్ట బెట్టేసిన ప్రాణాంతక కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వేళ.. చైనా సరి కొత్త దాడి చేస్తోంది. తమను వేలెత్తి చూపుతోన్న దేశాలపై ఎదురుదాడికి దిగింది.. అదీ పక్కా ప్లానింగ్ ప్రకారం. చైనా తమ దేశంలో జన్మించలేదనే విషయాన్ని పలుమార్లు చెప్పుకొన్న చైనా.. ఆ బురదను ఇతర దేశాలకు పూసే ప్రయత్నానికి తెర తీసింది. కరోనా వైరస్ భారత్లో జన్మించిందనే విషయాన్ని శాస్త్రవేత్తల నోట చెప్పిస్తోంది. భారత్ లేదా బంగ్లాదేశ్లల్లో జంతువుల ద్వారా ఈ వైరస్ మనుషుల్లోకి ప్రవేశించిందని, వారి ద్వారా వుహాన్కు చేరుకుందని వాదిస్తోంది.
Recommended Video
విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ..
గత ఏడాది నవంబర్లో తొలిసారిగా కరోనా వైరస్ జాడలు చైనాలోని వుహాన్ సిటీలో కనిపించిన విషయం తెలిసిందే. అక్కడి ఓ ఫిష్ మార్కెట్లో ఓ మహిళ వ్యాపారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఈ విషయాన్ని అన్ని దేశాలు నిర్ధారించాయి కూడా. చైనా నుంచే ఈ మహమ్మారి పుట్టుకొచ్చిందంటూ పేర్కొన్నాయి. ఈ విషయంలో చైనా మరో అడుగు ముందుకేసింది. వైరస్కు జన్మనిచ్చిన చైనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కాపాడే ప్రయత్నం చేస్తోందంటూ తన వాటా నిధులను పంపిణీ చేయడాన్ని నిలిపివేసింది కూడా.
భారత్ను టార్గెట్ చేసిన చైనా
ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఎదురుదాడికి దిగింది. ఇదివరకు ఇటలీ వంటి యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా జన్మించినట్టు చెప్పుకొన్న చైనా శాస్త్రవేత్తలు.. తమ స్వరం మార్చారు. భారత్ను టార్గెట్ చేశారు. గత ఏడాది వేసవి సీజన్లోనే ఈ కరోనా వైరస్ భారత్లో జన్మించిందంటూ చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు ఓ నివేదికను రూపొందించారు. దీనిపై ఓ ప్రజెంటేషన్ నిర్వహించారు. జంతువుల ద్వారా మనుషులకు కరోనా వైరస్ సంక్రమించిందని స్పష్టం చేశారు. ప్రయాణికుల ద్వారా అది వుహాన్కు చేరిందని తాము అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆ జాబితాలో మరిన్ని దేశాలు..
కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన దేశాల జాబితాలో ఇదివరకు అమెరికా, గ్రీస్, ఇటలీ, రష్యా, చెక్ రిపబ్లిక్, సెర్బియా పేర్లను చేర్చారు చైనా శాస్త్రవేత్తలు. ఈ సారి భారత్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాల పేర్లను ప్రకటించింది. భౌగోళికంగా, వాతావరణ పరంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య సారూప్యత ఉందని, పైగా ఈ రెండు దేశాలు సరిహద్దులను పంచుకుంటున్నాయని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడి అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీటి కారణంగా.. తొలుత కరోనా వైరస్ జంతువుల్లో ఆవిర్భవించి ఉంటుందని ఈ ప్రజంటేషన్లో స్పష్టం చేశారు.
సమ్మర్ సీజన్లోనే వైరస్..
గత ఏడాది వేసవిలో వైరస్ జన్మించిందనడానికి సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం మనుషులకు సంక్రమించి ఉంటుందని చెప్పారు. విమాన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ వుహాన్కు చేరి ఉంటుందని అంచనా వేస్తున్నామని అన్నారు. శతాబ్దాల నుంచి సంప్రదాయబద్ధమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉన్న చైనీయుల్లో.. కొత్తగా ఈ వైరస్ పుట్టుకొని రావడానికి అవకాశమే లేదని తాము అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. భారత్లో నాసిరకం వైద్య వ్యవస్థ ఉందని, అక్కడి యువత వైరస్ను విస్తృతంగా వ్యాప్తి చేసిందని అనుమానిస్తునట్లు పేర్కొన్నారు.