చైనా వెన్నుపోటు: భారత్పై గూఢచర్యం: లఢక్ వద్ద కలకలం: జవాన్ల చేతిలో బందీగా సైనికుడు
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా కలకలం చెలరేగింది. భారత్ను దొంగదెబ్బ తీయడానికి చైనా కుట్ర పన్నినట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భారత్పై డ్రాగన్ కంట్రీ గూఢచర్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన ఓ సైనికుడిని భారత జవాన్లు బంధించారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించాడని, అతని వద్ద సైన్యానికి చెందిన సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. గూఢచర్యం కోణంలో భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు.
Recommended Video
ట్విట్టర్ దుస్సాహసం: జమ్మూ కాశ్మీర్, లఢక్ చైనాలో భాగం: వార్ మెమొరియల్ సైతం డ్రాగన్ కంట్రీదే
వివాదాస్పద వాస్తవాధీన రేఖ వద్ద..
లఢక్ తూర్పు సెక్టార్ పరిధిలోని చుమర్-డెమ్చొక్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత సరిహద్దు భద్రతా జవాన్ల చేతిలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుడు బందీగా ఉన్న విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. అతని వద్ద ఏదైనా సమాచారం లభించిందా? లేదా? అనే విషయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉంది. సైనిక పరమైన లాంఛనాలను పూర్తయిన తరువాత అతణ్ని చైనాకు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భారత జవాన్ల కళ్లుగప్పి..
భారత సరిహద్దు జవాన్ల కళ్లు గప్పి, వాస్తవాధీన రేఖ, సరిహద్దులను దాటుకుని ఆ సైనికుడు భారత భూభాగంపైకి ప్రవేశించాడని అధికారులు వెల్లడించారు. అతణ్ని ఆధీనంలోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. అతను ఏ కారణంతో భారత భూభాగంపైకి వచ్చాడనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు. ఆ సైనికుడు ధరించిన దుస్తులపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లోగో ఉన్నట్లు తేలిందని తెలుస్తోంది. షాంగ్షీ ప్రావిన్స్ విభానికి చెందిన సైనికుడిగా గుర్తించినట్లు చెబుతున్నారు. అతని వాంగ్ యా లాంగ్గా తేలినట్లు చెబుతున్నారు.
సివిల్, మిలటరీ డాక్యుమెంట్లు..
అతని వద్ద సివిల్, మిలటరీకి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు లభించినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఆ సైనికుడు భారత్పై గూఢచర్యానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అతని వద్ద లభించిన సివిల్, మిలటరీ డాక్యుమెంట్లు దేనికి సంబంధించినవో ఇంకా తెలియరాలేదు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్-చైనా దేశాల మధ్య రక్షణశాఖపరంగా చర్చలు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చర్చల పేరుతో చైనా దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.
అక్రమ చొరబాటు ఫలితంగా..
ఒకవైపు చర్చలు కొనసాగిస్తూనే.. మరోవైపు గూఢచర్యానికి పాల్పడుతోందనే విషయం దీనితో రుజువైందని అంటున్నారు. సైనిక లాంఛనాలు, ప్రొటోకాల్ పూర్తయిన తరువాత.. అతణ్ని చైనాకు అప్పగిస్తామని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ అక్రమ చొరబాటు ప్రభావం రెండు దేశాల మధ్య దశలవారీగా కొనసాగుతోన్న చర్చలపై పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. గూఢచర్యానికి పాల్పడినట్లు తేలితే.. ఆ సైనికుడిని చైనాకు అప్పగించడంలో జాన్యం చోటు చేసుకోవచ్చనీ చెబుతున్నారు.