కౌంట్ డౌన్ స్టార్ట్: దూసుకొస్తున్న చైనా స్పేస్ల్యాబ్, కూలేది ఈ వారంలోనే, ఎక్కడంటే...
బీజింగ్: అంతరిక్షంలో గతి తప్పి భూమి వైపు దూసుకొస్తోన్న చైనా స్పేస్ల్యాబ్ తియాంగోంగ్-1 ఈ వారంలో భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఈ స్పేస్ల్యాబ్ చాలా వరకు మండిపోతుందని, దాని శకలాలు మాత్రం భూమిపై పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 2 మధ్య ఎప్పుడైనా తియాంగోంగ్-1 భూమిపై కూలిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చైనా 2011లో తన తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రమైన తియాంగోంగ్-1ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఐదేళ్లపాటు సేవలందించిన తర్వాత ఈ స్పేస్ ల్యాబ్ 2016లో గతి తప్పింది. 8.6 టన్నుల బరువున్న ఈ స్పేస్ ల్యాబ్ భూమి దిశగా కదలడం ప్రారంభించింది.
తియాంగోంగ్-1 శకలాలు మార్చి నెల మధ్యలో భూమిపై పడవచ్చని కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ కార్పొరేషన్ తొలుత ప్రకటించగా, తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మరింత కచ్చితమైన అంచనాలను ప్రకటించింది.
ఈఎస్ఏ అంచనాలను బట్టి స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, గ్రీస్ ప్రాంతాల్లో తియాంగోంగ్్-1 స్పేస్ల్యాబ్ శకలాలు పడవచ్చని, అవి కూడా 20-40 శాతం మాత్రమేనని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.