వెంటాడి చంపుతాం: విద్యార్థులే పావులుగా భారత్పై చైనా కుట్రలు, ఆస్ట్రేలియా ఆగ్రహం
సిడ్నీ: డోక్లాం వివాదం సద్దుమణింగిందని భావించినప్పటికీ చైనా మాత్రం తన కుట్రలు కుతంత్రాలను ఆపడం లేదు. అంతర్జాతీయంగా భారత్కు వ్యతిరేకంగా పనిచేయాలనే రహస్య అజెండాను చైనా ప్రభుత్వం అమలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ఆయా దేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులను చైనా పావులుగా వాడుకుంటోంది. దీంతో ఆయా దేశాలకు తలనొప్పి వ్యవహారంగా తయారైంది.ఇలాంటి అనుభవాన్ని మొదట ఆస్ట్రేలియా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
మొదట ఎదుర్కొంది ఆస్ట్రేలియానే..
అంతేగాక, ఇవి శాంతిభద్రతల సమస్యగా మారతాయని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ ఒకప్పటి సలహాదారు, చైనాలో ఆస్ట్రేలియా ప్రతినిధి అయిన జాన్గార్నౌట్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులను బృందాలుగా తయారు చేసి వారితో చైనా ప్రయోజనాలకు అనుగుణంగా ఆందోళనలను చేపడుతోందని ఆయన ఆరోపించారు.
వాస్తవం చెప్పినందుకు.. చైనా విద్యార్థుల ఆందోళనలు
ఇటీవల సిడ్నీ విశ్వవిద్యాలయంలో ఒక ఐటీ అధ్యాపకుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు. దీనికి కారణం ఏమిటంటే.. ఒక భారతీయ మూలాలు ఉన్న ఐటీ ప్రొఫెసర్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఒక మ్యాప్తో పాఠాలు చెప్పారు. ఈ మ్యాప్లో చైనా తనదిగా ప్రకటించుకున్న కొన్ని భూభాగాలను భారత్లో భాగంగా చూపించారు. 18 నెలల క్రితం జరిగిన ఈ విషయాన్ని ఇటీవల ఆస్ట్రేలియన్ రెడ్స్కార్ఫ్ అనే చైనా విద్యార్థుల వుయ్చాట్ గ్రూప్లో పోస్టు చేశారు. దీంతో ఆ ప్రొఫెసర్ క్షమాపణ చెప్పాలని వారు ఇప్పుడు ఆందోళనకు దిగడం గమనార్హం. ఇందులో చైనా కుట్ర ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని భారతీయ హైకమిషనర్ ఆస్ట్రేలియా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటువంటివే మరో మూడు ఘటనలు కూడా చోటు చేసుకోవడం గమనార్హం.
వెంటాడి చంపుతామంటూ..
భారత 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చైనా విద్యార్థులు లగ్జరీ కార్లతో
భారతీయ దౌత్య కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చైనాను దెబ్బతీయాలనుకునే వారు ఎంత దూరంలో ఉన్నా వెంటాడి చంపుతామనే నినాదాలు చేయడం గమనార్హం.
ఆస్ట్రేలియాలో చైనాపై వ్యతిరేకత
కాగా, ఈ పరిణామాలు ఆస్ట్రేలియా ప్రజానికానికి చైనా విద్యార్థులపై వ్యతిరేకతను కలిగించింది. ఈ వ్యవహారం ఆస్ట్రేలియా ప్రభుత్వంలో పలు అనుమానాలను లేవదీసింది. ఈ విద్యార్థులకు బీజింగ్ నుంచే నేరుగా సూచనలు వస్తున్నట్లు భావిస్తోంది.
ఆస్ట్రేలియానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా..
అంతేగాక, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికార బృందంలోని యునైటెడ్ ఫ్రంట్వర్క్ డిపార్ట్మెంట్ ఇదే పనిలో ఉన్నట్లు భావిస్తున్నారు. జిన్పింగ్ ప్రభుత్వం చైనా లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిజేసేందుకు వీరిని వాడుకుంటోందని గార్నౌట్ ఆరోపించారు. ఇటువంటి చర్యల వల్ల దేశాల మధ్య సంబంధాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా సమాజంపై ఇలాంటి పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చైనా ప్రోత్సహిస్తుండటం దురదృష్టకరమని అన్నారు.