అమెరికాలో క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది, అలా చెప్పుకునేవారు తగ్గారు
వాషింగ్టన్: గత కొన్నేళ్లుగా అమెరికాలో క్రిష్టియన్లం అని చెప్పుకునే వారి సంఖ్య తగ్గుతోందట. గత ఏడేళ్లుగా క్రమంగా ఇది తగ్గుతోంది. ప్యూ రిసెర్చ్ సెంటర్ 'అమెరికాస్ చేంజింగ్ రిలీజియస్ ల్యాండ్ స్కేప్ పైన మంగళవారం నాడు ఓ నివేదికను విడుదల చేసింది.
ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. క్రైస్తవ తెగల్లోని ప్రొటెస్టెంట్లు, రోమన్ కేథలిక్కులు.. ఎవరు అనే తేడా లేకుండా అన్ని వర్గాలలోని క్రైస్తవులలో నాస్తికత్వం క్రమంగా పెరుగుతోంది. అమెరికాలోని పలువురు క్రిష్టియన్లు నాస్తికులుగా మారుతున్నారు.
మరికొందరు హిందూమతంలోకి, ముస్లీం మతంలోకి మారుతున్నారట. ఈ ట్రెండ్ ప్రతిచోట, ప్రతి సమయంలోను ఉంటుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెన్ కూపర్ మెన్ చెప్పారు.
క్రిష్టియానిటి ఇప్పటికీ అమెరికాలో డామినేట్ చేస్తున్న మతం అని, అది 70 శాతం ఉందని చెప్పారు. కానీ, క్రమంగా తగ్గుతోందని చెప్పారు.
2007 - 2014 మధ్య కాలంలో ఈ వర్గం వారి సంఖ్య గణనీయంగా అంటే దాదాపు 8 శాతం మేర పడిపోయింది. 2007లో వీరి శాతం 78.4గా ఉంటే, 2014లో 70.6 శాతంగా ఉన్నారు. మసాచుసెట్స్లో పది శాతం తగ్గింది. సౌత్ కరోలినాలో కూడా దాదాపు అంతే ఉంది. మిడ్ వెస్ట్లో మూడు నుండి నాలుగు శాతం మేర తగ్గింది.
2007లో నాస్తికుల సంఖ్య 16.1 శాతం ఉండగా, 2014 నాటికి 22.8 శాతానికి పెరిగింది. హిందూ, ముస్లీం మత విశ్వాసుల సంఖ్య 4.7 శాతం నుండి 5.9 శాతానికి పెరిగింది. తమను తాము క్రిష్టియన్లుగా చెప్పుకునే వారి సంఖ్య పడిపోయింది.