సంచలనం: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్! ఆ మూడు రాష్ట్రాల్లో..
అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలైన మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కన్సిన్ ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది.
మిచిగాన్ : అమెరికన్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇదో షాకింగ్ వార్త. అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాలైన మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కన్సిన్ ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. హ్యాకింగ్ కు సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని అక్కడి డేటా సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ మూడు రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గెలుపొందడం, హిల్లరీ ఓటమి పాలవడం గమనార్హం. మిచిగాన్ లో 16, పెన్సిల్వేనియాలో 20, విస్కన్సిన్ లో 10 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు దక్కించుకున్నారు ట్రంప్. హ్యాకింగ్ ఆరోపణలను బలంగా వినిపిస్తున్న అక్కడి డేటా సైంటిస్టులు, ఎలక్టోరల్ న్యాయవాదులు రీకౌంటింగ్ చేపట్టి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. గ్రీన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జిల్ స్టెయిన్ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. కొత్త అధ్యక్షుడు పదవిని చేపట్టకముందే రీకౌంటింగ్ ప్రక్రియను చేపట్టాలని పట్టుబడుతున్నారు.
రీకౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన నిధుల సేకరణను ఆన్ లైన్ పేజీ ద్వారా ప్రారంభించారు. ఫండ్ రైజింగ్ పేజీ ద్వారా ఇప్పటికే 2మిలియన్ల డాలర్లను సేకరించారు. ఎన్నికల సందర్బంగా.. ఓటర్ల సమాచారం, పార్టీల డేటా బేస్ సహా కొంతమంది వ్యక్తిగత ఈ-మెయిళ్లు సైబర్ ఎటాక్ ద్వారా హ్యాకింగ్ కు గురయ్యాయని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.
డెమెక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రతినిధి హేమా అబెదిన్ దీనిపై స్పందించారు. హ్యాకింగ్ పై స్వతంత్ర విచారణ జరపాల్సిందిగా జస్టిస్ డిపార్ట్ మెంట్ ను కోరాలని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కాగా, దాదాపు 2మిలియన్ల పాపులర్ ఓట్లను గెలుచుకున్న హిల్లరీ క్లింటన్ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల సిస్టం కారణంగా ఓటమిపాలయ్యారు.
మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కన్సిన్ ఎన్నికల్లో హ్యాకింగ్ జరగబట్టే హిల్లరీ ఓడిపోయారని డేటా సైంటిస్టులు బలంగా వాదిస్తున్నారు. ఎన్నికల్లో ఉపయోగించిన 70శాతం పేపర్ బ్యాలెట్లను సరిగా పరిశీలించలేదని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ ప్రొ.జే అలెక్స్ హోల్డర్ మ్యాన్ ఆరోపించారు. బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు .జరిగి ఉంటే రిగ్గింగ్ కు అవకాశముండేది కాదని, ఓటింగ్ మెషీన్లలో సైబర్ సెక్యూరిటీ సమస్యలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
దీంతో స్వింగ్ రాష్ట్రాల్లో ఓటమిపాలైన నాయకులంతా న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిందేనని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా, ఎన్నికల రీకౌంటింగ్ కు ఆఖరి అవకాశం ఈ శుక్రవారం నుంచి బుధవారం వరకు మాత్రమే ఉంది. న్యూయార్క్ టైమ్స్ మంగళవారం ప్రచురించిన ఓ కథనం ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.