శ్రీలంక పేలుళ్లలో మరో కోణం : కాపర్ ఫ్యాక్టరీలో బాంబుల తయారీ.... ఓనర్ కూడా ఆత్మాహూతి దళ సభ్యుడే!
కొలంబో: ఈస్టర్ సండే నాడు శ్రీలంకలో మారణకాండ సృష్టించడానికి కారణమైన అత్యంత శక్తిమంతమైన బాంబులను కొలంబోలోని ఓ కాపర్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు తెలుస్తోంది. తమకు అందిన పక్కా సమాచారం ఆధారంగా కొలంబో పోలీసులు కాపర్ ఫ్యాక్టరీ, దానికి చెందిన ఓ గిడ్డంగిపై దాడులు చేశారు. బాంబు తయారీకి ఉపయోగించినట్లు అనుమానిస్తోన్న కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- ఈ కాపర్ ఫ్యాక్టరీ యజమాని కూడా ఆత్మాహూతి దళ సభ్యుడే.
అతని పేరు ఇన్షాఫ్ అహ్మద్. అతను కూడా స్వయంగా ఆత్మాహూతి పేలుళ్లకు పాల్పడ్డాడు. కొలంబోలోని సిన్నామన్ గ్రాండ్ హోటల్ పై దాడి చేసి, తనను తాను పేల్చేసుకున్నాడు. సిన్నామన్ గ్రాండ్ హోటల్ పై అహ్మద్ జరిపిన దాడిలో పలువురు పర్యాటకులకు దుర్మరణం పాలయ్యారు.
కొలంబో శివార్లలోని వెల్లంపిటియా ప్రాంతంలో ఈ కాపర్ ఫ్యాక్టరీ ఉంది. శ్రీలంకకే చెందిన ఇన్షాఫ్ అహ్మద్ వివాహితుడు. అతనికి నలుగురు సంతానం. అతని తండ్రి సుగంధ ద్రవ్యాల వ్యాపారి. ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన అహ్మద్- వెల్లంపిటియా పారిశ్రామికవాడలో కాపర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాడు. చాలాకాలంగా ఈ ఫ్యాక్టరీ అక్కడ కొనసాగుతోంది. ఇన్షాప్ అహ్మద్ కు ఐసిస్ ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి ఉండొచ్చని, తదనంతరం అతను ఐసిస్ ఉగ్రవాదిగా లేదా సానుభూతిపరునిగా మారి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఈ ఫ్యాక్టరీపై దాడి చేసిన పోలీసులు.. తొమ్మిది మంది సిబ్బందిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. ఫ్యాక్టరీకి వచ్చీ, పోయే వారి గురించి ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్లో భారతీయులు, బంగ్లాదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్షాఫ్ అహ్మద్ సోదరుడు ఇల్హం ఇబ్రహీం కూడా ఆత్మాహూతి దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. షాంగ్రిలా హోటల్ పై ఆత్మాహూతిదాడి చేసింది ఇబ్రహీమేనని పోలీసులు ధృవీకరించారు.
ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ వాడకం
చర్చ్ లు, హోటళ్లపై ఆత్మాహూతి దళాలు అత్యంత శక్తిమంతమైన బాంబులను వినియోగించారని తేటతెల్లమైంది. అవి అంచనాకు మించి విధ్వంసాన్ని సృష్టించాయని పోలీసులు చెబుతున్నారు. ఈ బాంబుల తయారీలో ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ (టీఏటీపీ) ను వినియోగించి ఉంటారని అక్కడి భద్రతా బలగాలు, దర్యాప్తు ఏజెన్సీల అధికారులు అనుమానిస్తున్నారు. ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ అత్యంత శక్తిమంతమైనదని, దీన్ని వారు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఉండొచ్చని చెబుతున్నారు. దీన్ని విక్రయించిన దుకాణదారులపైనా పోలీసులు నిఘా వేశారు. ఆయా దుకాణదారులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. 2015లో ప్యారిస్, 2017లో మాంఛెస్టర్ లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు వినియోగించిన బాంబుల్లో కూడా ఇదే ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ ను వాడిన విషయం తెలిసిందే.