తోకముడిచిన చైనా.. భారత్కు సెల్యూట్.. అమెరికా దొంగాట..దొరికిన ట్రంప్.. మోదీకి ఫోన్ వట్టి ఫేక్
భారత్-చైనా మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు క్రమంగా తేలిపోతున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 25 రోజులుగా నెలకొన్న టెన్షన్ శక్రవారం నాటికి కాస్త సడలింది. సార్వభౌమత్వం విషయంలో ఇంచు కూడా వెనక్కి తగ్గబోమన్న భారత్ కమిట్మెంట్ ముందు డ్రాగన్ చైనా తోకముడిచింది. లదాక్, సిక్కిం సరిహద్దులో యుద్ధవాతావరణంపై చైనా రక్షణ శాఖ తొలిసారి స్పందించింది. తొలి ప్రకటనలోనే తెల్లజెండా ఊపుతూ.. భారత్ గీసిన శాంతిరేఖకు లోబడే తాము కూడా మసులుకుంటామని ప్రకటించింది. మొత్తం వ్యవహారంలో భారత్ చూపించిన సహనానికి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేస్తుండగా.. అమెరికా ప్రెసిడెంట్ డొనల్డ్ ట్రంప్ మాత్రం దొంగాట ఆడి.. అడ్డంగా దొరికిపోయారు.
Recommended Video
చైనాను అటునుంచి నరుక్కొస్తున్న భారత్.. అమెరికాకు షాక్.. మోదీ సర్కారు కీలక ప్రకటన..
ఇదీ జరిగింది..
దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య భారత్ నిర్మించిన రోడ్డును మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న చైనా.. ఉన్నట్టుండి మే నెల ప్రారంభం నుంచి తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయ, ఉత్తర సిక్కింలోని నాథులా ప్రాంతాల్లో గస్తీకాస్తోన్న భారత బలగాను అడ్డుకోవడం, బాహాబాహీకి దిగడం లాంటి దుశ్చర్యలకు పాల్పడింది. కరోనా వైరస్ ఆరోపణలు, హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం, తైవాన్ ఆక్రమణ తదితర అంశాల్లో ఈ నెలంతా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటి నుంచి ప్రపంచం దృష్టిని మరల్చడానికే చైన.. భారత్ సరిహద్దులో అలజడి రేపింది. యుద్ధానికి రెడీ అవుతోన్నంత స్థాయిలో సైనికులను మోహరించడంతోపాటు సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్ లకు యుద్ధ విమానాలను సైతం తరలించింది. అయితే, చైనా ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొంటూనే శాంతి తప్ప మరో మార్గాన్ని ఎంచుకోబోమని భారత్ కుండబద్దలుకొట్టింది.
చైనా తాజా ప్రకటన..
సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటూనే సరిహద్దు వివాదాలపై చైనాతో శాంతికి కట్టుబడి ఉన్నామని, సైనికపరంగానే కాకుండా దౌత్యమార్గాల్లోనూ ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసిన కొద్ది గంటలకే చైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భారత్ లాగే చైనా కూడా శాంతిని కోరుతున్నదని, సరిహద్దు ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని, ప్రస్తుతానికి ఎల్ఏసీ వెంబడి పరిస్థితి అదుపులోనే, సాధారణంగా ఉందని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి రెన్ గుయోకియాంగ్ ప్రకటించారు. గురువారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ ప్రకటన చేశారు.
అమెరికా అవకాశవాదం..
భారత్-చైనాలు నేరుగా సైనిక, రాయబార స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతుండగానే.. అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందంటూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంఫ్ ప్రకటన చేయడం తెలిసిందే. కరోనా విలయం కంటే ముందు నుంచే చైనాను టార్గెట్ చేసిన ట్రంప్.. ఆ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నారు. చైనాతో సరిహద్దు వివాదంలో భారత్ ను కూడా తనవైపునకు తిప్పుకునేందుకు అమెరికా శతవిధాలుగా ప్రయత్నించింది. చైనాకు వ్యతిరేకంగా.. ఆసియాలో సారూప్య భావజాలం కలిగిన దేశాలతో కూటములు నిర్మిస్తామనీ ప్రకటించింది. భారత్ మాత్రం అమెరికా ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. దీంతో ట్రంప్ తనకు బాగా అలవాటైన మరో మార్గాన్ని ఎంచుకున్నారు..
మోదీకి ట్రంప్ ఫోన్ చేయలేదు..
‘‘చైనాతో సరిహద్దు వివాదంలో భారత ప్రధాని మోదీ చాలా అప్ సెట్ అయ్యారు. కొద్ది సేపటికిందటే ఆయనతో ఫోన్ లో మాట్లాడాను. మోదీ మూడ్ ఏమంత బాగోలేదు. ఆ రెండు దేశాల మధ్య పెద్ద ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. నిజానికి ఈ దుస్థితి రెండు దేశాలకూ ఇష్టం లేదు. ఇండియాను జనం నన్ను బాగా ఇష్టపడతారు. అందుకే నా వంతుగా మధ్యవర్తిత్వం చేస్తానని ఆఫరిచ్చాను''అని ప్రెసిడెంట్ ట్రంప్ మీడియా సాక్షిగా వెల్లడించారు. కానీ నిమిషాల వ్యవధిలోనే ట్రంప్ అడ్డంగా దొరికిపోయాడు. ఆయనసలు భారత ప్రధాని మోదీకి ఫోన్ కాల్ చేయనేలేదని, చివరిసారిగా భారత్-అమెరికా అధినేతలు ఏప్రిల్ నెలలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ విషయమై ఫోన్ లో మాట్లాడుకున్నారని, ట్రంప్ తాజా ప్రకటన పూర్తిగా అబద్ధమని కేంద్ర వర్గాలు సంచలన ప్రకటన చేశాయి.
ముప్పు తప్పినట్లేనా?
చైనా రక్షణ శాఖ ప్రకటనతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ.. ముప్పు తప్పిందని మాత్రం చెప్పలేమని డిఫెన్స్ నిపుణులు అంటున్నారు. భారత్ తో శాంతిని కోరుకుంటున్నట్లు ప్రకటించిన చైనా... లదాక్, సిక్కిం సరిహద్దుల వద్ద భారీగా సైన్యాల మోహరింపు, సమీపంలోని ఎయిర్ బేస్ ల వద్ద యుద్ధ విమానాల నిలిపివేత, నిఘా డ్రోన్ల ఎగరవేతపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బీజింగ్ నుంచి వెలువడిన స్టాండాఫ్ ఆదేశాలను ఇంకా వెనక్కి తీసుకోకపోవడం కూడా చర్చనీయాంశమైంది. చైనా చెప్పే మాటలకు.. చేసే చేతలకు పొంతన ఉండదని ఇందివరకు చాలా సార్లు రుజువైంది. కాబట్టే భారత్ కూడా తన స్టాండాఫ్ ఆదేశాలను వెనక్కి తీసుకోకుండా.. చైనాతో సరిసమానంగా హోహరించిన బలగాలను ఇంకొన్నాళ్లు అక్కడే కొనసాగించే అవకాశముంది.