హెచ్1బీ : ట్రంప్కు కాంగ్రెస్ సభ్యుల షాక్, చిగురిస్తున్న భారత ఐటీ రంగం ఆశలు
వాషింగ్టన్: హెచ్1బీ వీసా విషయంలో భారత ఐటీ రంగం ఆశలు చిగురిస్తున్నాయి. ఈ వీసా నియంత్రణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం చర్యలను కొంతమంది అమెరికాన్ కాంగ్రెస్ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు.
హెచ్1బీ వీసాలను తగ్గిస్తే దాదాపు 5 లక్షల నుంచి 7.5 లక్షల మంది భారతీయ నిపుణులు దేశాన్ని విడిచివెళతారని, దీంతో అమెరికాను నైపుణ్యాల కొరత వెంటాడుతుందని కాంగ్రెస్ సభ్యులతో పాటు పలు ఇండో అమెరికన్ సంస్థలు ట్రంప్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాయి.
ఈ నిరంకుశ నియంత్రణలు హెచ్1బీ వీసాలు కలిగిన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని, అమెరికన్ సమాజంలో నైపుణ్యాల కొరత తలెత్తుందని డెమొక్రటిక్ సభ్యురాలు తుల్సి గబార్డ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ నిర్ణయంతో చిన్న వాణిజ్య సంస్థలు, ఉద్యోగాలను సృష్టిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతంగా ఉన్న భారత హెచ్1బీ వీసాహోల్డర్లు దేశాన్ని వీడే పరిస్థితి నెలకొంటుందని, అన్నింటికీ మించి అమెరికాకు కీలక భాగస్వామి అయిన భారత్తో సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు.
21వ శతాబ్ధంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అమెరికా పోటీ పడే క్రమంలో నైపుణ్యాల లేమి అవరోధంగా నిలుస్తుందని డెమొక్రటిక్ సభ్యురాలు తుల్సి గబార్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు హెచ్1బీ వీసా గడువు పెంపును నిరాకరిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
వేలాది మంది నిపుణులను ఎలా తిప్పిపంపుతారని ఫౌండేషన్ ప్రశ్నించింది. మరోవైపు ఈ ప్రతిపాదనను ట్రంప్ యంత్రాంగం వెంటనే విరమించాలని ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కూడా కోరారు. ఈ ప్రతిపాదన వలస వ్యతిరేకమైనదని మరో సభ్యుడు ఆర్ ఖన్నా వ్యాఖ్యానించారు.