కరోనా పుట్టింది నేడే: ఏడాదిగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల వారిని తీవ్ర భయాందోళనలోకి నెట్టివేసింది . అగ్ర దేశాలను సైతం ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ బయటపడి ఈ రోజుకి సరిగ్గా ఏడాది. కరోనా వైరస్ ఎప్పుడు బయట పడింది అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి బయటపడి ఈ రోజుతో ఈ ఏడాది పూర్తవుతుందని చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.
చైనాలోని హుబెయ్ ఫ్రావిన్స్ లో నవంబర్ 17న తొలి కేసు గుర్తింపు
చైనాలోని హుబెయ్ ఫ్రావిన్స్ లో గతేడాది సరిగ్గా ఇదే రోజు నవంబర్ 17వ తేదీన 55 ఏళ్ల వ్యక్తి లో కరోనా వైరస్ పాజిటివ్ వెలుగు చూసిందని చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.కరోనా వైరస్ వెలుగుచూసిన మొదటి రోజుల్లో రోజుకు గరిష్టంగా నాలుగైదు కేసులు వచ్చేవి . డిసెంబర్ 15 నాటికి మొత్తం 27 కేసులు నమోదయ్యాయి. అయితే మొదట్లో వైద్యులు ఈ వైరస్ ను గుర్తించడానికి ప్రయత్నాలు చేసి, మామూలు వైరస్ కేసులని పేర్కొన్నప్పటికీ, ఇవన్నీ కొత్త రకం కరోనా వైరస్ వేనని హుబెయ్ లోని ఒక వైద్యుడు పేర్కొన్నారు.
ప్రపంచానికి ఆరోగ్య సంక్షోభం , ఆర్ధిక సంక్షోభం
హుబెయ్ రాజధాని నగరమైన వూహాన్ నగరంలో ఈ ఏడాది జనవరి నెలలో కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇది ప్రపంచానికి తెలిసింది. కరోనా వైరస్ గురించి తెలుసుకొని ప్రపంచదేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి . చైనాలో మొదలైన కరోనా వైరస్, ప్రపంచ దేశాలలో విస్తరించి ఆర్థిక సంక్షోభంతో పాటుగా, ఆరోగ్య సంక్షోభానికి కారణమైంది. అగ్ర దేశమైన అమెరికా కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతింది. ప్రపంచంలోనే కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
కరోనా తీవ్రత గుర్తించటంలో చైనా ఫెయిల్ .. అందుకే ప్రపంచానికీ తిప్పలు
మొదటి కరోనా వైరస్ గబ్బిలం నుండి మనుషులకు వచ్చిందని, జంతువుల నుండి కరోనా వైరస్ సోకిందని రకరకాల ప్రచారం జరిగింది. చైనా ల్యాబ్ నుండి కరోనా వైరస్ వచ్చిందని, ఇది బయో వార్ కు సంకేతమని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తొలిదశలో కరోనా తీవ్రతను గుర్తించటంలో చైనా విఫలం కావడంతో ప్రపంచ దేశాలన్నీ కరోనా ప్రభావాన్ని చవి చూడాల్సి వస్తోంది. ఇప్పటివరకు ప్రపంచంలో కరోనా ను కట్టడి చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ , కంప్లీట్ గా లాక్ డౌన్ చేసి ఇబ్బందులు పడినా పూర్తిస్థాయిలో కరోనా వైరస్ నివారించబడలేదు.
Recommended Video
సంవత్సరం గడిచినా ఇంకా రాని వ్యాక్సిన్
కరోనా కట్టడి జరగాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి . కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ప్రయోగాలు సక్సెస్ అయ్యి వ్యాక్సిన్ వస్తే కరోనా నుండి ఒకింత ఊరట . లేదంటే కరోనాతో సహజీవనం చెయ్యాల్సిందే అన్న భావాన్ సర్వత్రా వ్యక్తం అవుతుంది . కరోనా వైరస్ పుట్టి నేటికి సరిగ్గా సంవత్సర కాలమైనా ఈరోజుకీ కరోనా వ్యాక్సిన్ రాకపోవడం, కరోనాని కట్టడి చేయలేక పోవడం గమనార్హం .