కరోనాతో ముంచుకొస్తున్న ఉపద్రవం ... ప్రపంచానికి తీవ్ర ఆహార సంక్షోభం !!
ఊహించని ఉపద్రవం ప్రపంచాన్ని ఆవేదనకు గురి చేస్తుంది . అతివృష్టి , అనావృష్టి పరిస్థితులను తట్టుకుని , పంటలకు వచ్చే చీడపీడలను ఎదుర్కొని ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కరోనా కాటు వేసింది. ఏ దేశంలో చూసినా పండించిన పంట అమ్ముకునే పరిస్థితి లేకుండా చేసింది . ఎగుమతులు లేవు. దిగుమతులు లేవు. వర్తక వాణిజ్యాలు దెబ్బ తిన్నాయి. ఇక తాజా పరిస్థితులు ఆహార సంక్షోభానికి కారణం అవుతాయనే భావన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతుండగా మరి కొన్ని రోజులు లాక్ డౌన్ కొనసాగితే ప్రజలకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తుంది.
గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ బాధితులకు పౌష్టికాహారం .. మెనూ ఇదే
ఇక ఇప్పటికే కరోనా సంక్షోభాన్ని అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది . ఇక ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కోకపోతే ప్రపంచ ప్రజలకు ఆహార కొరత ప్రమాదం పొంచివున్నదని మూడు అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాని అడ్డుకునేందుకు లాక్డౌన్ని ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం, ఆహారసరఫరా ఊహించని విధంగా తగ్గుముఖం పట్టింది. లాక్డౌన్ కారణంగా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందనే భయంతో అనేక దేశాల్లోని ప్రజలు ముందుగానే సరుకులను కొనిపెట్టుకోవడంతో సూపర్ మార్కెట్లు తదితర షాపుల్లో వస్తువుల సరఫరా నిలిచిపోయింది.
ఇక పలు నిత్యావసరాలను సప్లై చేసే వాళ్ళు సైతం భవిష్యత్ లో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్న భావనలో నిత్యావసరాలను బ్లాక్ చేస్తున్నారు . ఇది ఒక్క భారత్ లోనే కాదు ప్రపంచ దేశాలు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది . ఆహార లభ్యతపై ఏర్పడుతోన్న సందిగ్ధత అంతర్జాతీయ ఎగుమతులపై ఆంక్షలకు కారణమౌతోంది. ఇది ప్రపంచ మార్కెట్లో ఆహార కొరతకు దారితీస్తోందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధిపతి క్యూ డొంగ్యూ హెచ్చరించారు. ఇప్పుడు ఈ విపత్తును సమర్ధంగా ఎదుర్కోవాలని, రానున్న కష్టకాలాన్ని సంఘటితంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు .