కరోనా ఎఫెక్ట్ ... ఆ తిండి విషయంలో చైనా సంచలన నిర్ణయం
కరోనా వైరస్... ఇది చైనీయుల నుండి ప్రపంచ దేశాలకు వ్యాపించిన వైరస్. ప్రపంచ దేశాలను ప్రస్తుతం గడగడలాడిస్తున్న ఈ వైరస్ ప్రభావంతో లక్షల సంఖ్యలో ప్రజలు బాధితులుగా మారుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అతి భయంకరమైన ఈ వైరస్ చైనీయుల ఆహారపు అలవాట్ల వల్లే వచ్చిందని ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. చైనీయులు కుక్క, పాము, కప్ప, బొద్దింక ఇలా జంతువులు, కీటకాలు తినటం వల్ల కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఇక చైనాలోని వుహాన్ నగరంలోని జంతువధశాల కేంద్రంగా 2019, డిసెంబర్ నెలలో కరోనా వైరస్ ప్రబలిన నేపధ్యంలో అందరూ చైనా ను టార్గెట్ చేస్తున్నారు . ఇక దీంతో చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది .
చైనీయుల ఆహారపు అలవాట్లపై ఇప్పటికే రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియోలు పెట్టి మరీ వారి ఆహారపు అలవాట్లను ప్రశ్నిస్తున్నారు. ఇవి తింటే కరోనా రాదా.. అవి తింటే కరోనా రాదా ? అంటూ వారి ఫుడ్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక దీంతో సంచలన నిర్ణయం తీసుకుంది చైనా. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో చైనాలోని షెన్జెన్ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములతో పాటు రక్షిత వన్యప్రాణులకు తినడాన్ని నిషేధించారు.
Recommended Video
పాములు, బల్లులు, పిల్లులు, కుక్కలతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగంపై షెన్జెన్లో నిషేధం విధించడం ఇదే తొలిసారి . అంతే కాదు కుక్కలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువుల వినియోగాన్ని అభివృద్ధి చెందిన హాంగ్కాంగ్, తైవాన్ దేశాల్లో ఇప్పటికే నిషేధించారు. అయితే కొత్తగా రూపొందించిన ఈ చట్టం నుంచి కోళ్లు, బాతులు, పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, పావురాలు, పిట్టలకు నిషేధం నుంచి మినహాయించారు. ప్రపంచం మొత్తం చైనా ప్రజలను, చైనీయుల ఆహారపు అలవాట్లను టార్గెట్ చేస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవటం నిజంగానే సంచలనం .