కరోనా ఎఫెక్ట్ .. సంక్షోభంలో ఆయిల్ ఇండస్ట్రీ... ఉత్పత్తి తగ్గిస్తున్న కంపెనీలు
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక నష్టం జరుగుతుంది. ఇది అది అన్న తేడా లేకుండా అన్ని పరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రపంచంలోని ప్రతీ దేశం కరోనా ప్రభావంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ ఇండస్ట్రీ సంక్షోభం ఎఫెక్ట్ అన్ని చమురు ఉత్పాదక సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాయి.
Recommended Video
రవాణా వ్యవస్థ స్తంభించటంతో బాగా పడిపోయిన ఇంధన వినియోగం
కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో ప్రపంచమే లాక్ డౌన్ దిశగా అడుగులు వేసింది. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఇంధన వినియోగం గణనీయంగా తగ్గిపోయింది . కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించటంతో ఇంధన వినియోగం ఘోరంగా పడిపోయింది . ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతో ఇంధన వినియోగం లేక చమురు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయింది. ఇక భారత దేశం విషయానికి వస్తే 130 కోట్ల జనాభా ఉన్న మనదేశం మూడు వారాలుగా లాక్డౌన్ పాటిస్తోంది.నిత్యం వాహన రాకపోకలతో రణగొణ ధ్వనులతో బిజీగా ఉండే దేశం ఒక్క సారిగా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా మారిపోయింది .
ప్రపంచ ఆయిల్ మార్కెట్ను దారుణంగా దెబ్బతీసిన కరోనా
కరోనా మహమ్మారి ప్రపంచ ఆయిల్ మార్కెట్ను దారుణంగా దెబ్బతీసింది. జనం ఇళ్లకే పరిమితమవడంతో ద్విచక్ర వాహనాల నుండి నుంచి భారీ వాహనాల వరకు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో ఆయిల్ ఇండస్ట్రీ సంక్షోభంలో పడింది. మునుపెన్నడూ లేని విధంగా నెలకొన్న సంక్షోభంతో పలు దేశాలు ఆయిల్ ప్రొడక్షన్ ను బాగా తగ్గించాయి. ఉత్పత్తిలో కోత విధించాయి. సౌదీ అరేబియా, రష్యా, అమెరికా లాంటి దేశాలు ఇకపై రోజుకు పది మిలియన్ బారెల్ ల ఇంధనాన్ని మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్టు తెలుస్తుంది .
ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయం తీసుకున్న చమురు సంస్థలు
ఆయిల్ రిఫైనరీల నుంచి పెట్రోల్ బంకుల వరకు ఇంధన రంగంతో ముడిపడి ఉన్న అన్ని వ్యవస్థలు ఇప్పటి వరకు ఎన్నడూ లేని తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.ఇక దీంతో ఈ గడ్డు పరిస్థితులు గట్టెక్కే వరకు , కరోనా ప్రభావం తగ్గేవరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసే వరకు ప్రొడక్షన్ తగ్గించి ఖర్చు తగ్గించుకోవటం మినహాయించి వేరే మార్గం కనిపించటం లేదు . ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ డిమాండ్ తగ్గడం, ఉన్న ఆయిల్ ఖర్చు కాకపోవడం, మరింత ఉత్పత్తి చేస్తే ఉత్పాదక వ్యయం, ఆయిల్ను నిల్వ చేయడం వంటి ఇబ్బంది కర పరిస్థితులు వెరసి అన్ని రకాల ఇబ్బందులు చమురు సంస్థలను చుట్టూ ముట్టాయి.
నష్ట నివారణా చర్యలపై దృష్టి పెట్టిన పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య
కరోనా ఎఫెక్ట్ కారణంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ 27 మిలియన్ బ్యారెల్కు పడిపోతుందని అంచనా వేస్తున్న పరిస్థితులు ఆయిల్ ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయిల్ వినియోగం రోజుకు 35 మిలియన్ బారెర్ల వరకు ఉంది. పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఇప్పటికే పరిస్థితిని సమీక్షించి నష్ట నివారణా చర్యలపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నష్టాన్ని కొంత మేర తగ్గించుకోవటం మినహాయించి చమురు సంస్థలకు ప్రత్యామ్నాయం లేదు .