కువైట్లో కరోనా కల్లోలం: 45కు చేరిన పాజిటివ్ కేసులు, ఇండియా సహా 7 దేశాలపై బ్యాన్, వెనక్కి ఫ్లైట్
కరోనా వైరస్ ప్రబలడంతో అన్నీ దేశాల తగిన చర్యలు తీసుకుంటున్నాయి. చైనా తర్వాత ఇరాన్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కువైట్లో కూడా ప్రభావం ఉండటంతో ఇండియా సహా ఏడు దేశాలపై నిషేధం విధించింది. దీంతో ప్రయాణికులతో కలిసి కువైట్ వెళ్లిన విమానం తిరిగి వచ్చింది. కరిపూర్లో గల కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 170 మంది ప్రయాణికులతో కలిసి విమానం వెళ్లిన సంగతి తెలిసిందే.
కువైట్ నుంచి విమానం వెనక్కి రావడంతో మిగతా విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అయితే కువైట్ నుంచి విమానం వెనక్కి రావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు కువైట్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 45కి చేరాయి. ఇందులో ఒకరు భారతీయ సంతతి వ్యక్తి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే 15 మందిలో 13 మంది ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు అని కువైట్ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలోకి వచ్చిన వారిని త్వరగా పరీక్షలు చేయడంతో వైరస్ బయటపడిందని పేర్కొన్నారు. ఎమిరేట్స్కు చెందిన ముగ్గురు, సౌదీ అరేబియాకు చెందిన ఇద్దరు, ఇథియోపియా, ఇరాన్ నుంచి ఇద్దరు చొప్పున.. థాయ్లాండ్, మొరాకో, చైనా, ఇండియా నుంచి ఒక్కొక్కరు ఉన్నారని పేర్కొన్నది. వైరస్ బారినపడ్డ వారిలో ఇద్దరు కోలుకున్నారని తెలిపారు. వైరస్ సోకినవారితో దగ్గరగా ఉన్న ఐదుగురికి కూడా పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు.