America shutdown: మూడు దశల్లో రీఓపెన్, కీలక మార్గదర్శకాలు, ట్రంప్ తగ్గారు!
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి అనేక వేల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతకంతకూ దిగజారిపోతోంది. దీంతో అప్రమత్తమైన అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై దృష్టి సారించి తక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది.
తగ్గిన ట్రంప్..
అమెరికాలో షట్డౌన్ ఎత్తివేతకు దశలవారీగా మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు ఆ మార్గదర్శకాల ఉత్తర్వులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందజేశారు. అంతేగాక, షట్ డౌన్ ఎత్తివేత అధికారం విషయంలో వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్ ఆ బాధ్యతలను పూర్తిగా ఆయా రాష్ట్రాల గవర్నర్లకే అప్పగించారు.
మొదటి దశలో ఇలా..
ఈ క్రమంలోనే ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు దేశంలో విధించిన షట్ డౌన్ ను మూడు దశలుగా ఎత్తివేయాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. కొత్తగా కరోనా సోకినవారు, లక్షణాలతో బాధపడుతున్నవారి సంఖ్య వరుసగా 14 రోజులపాటు తగ్గితే.. ఇంటికే పరిమితం కావాలన్న ఆదేశాలను సడలించవచ్చు. కరోనా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో కూడా ఆంక్షలను మినహాయించవచ్చు.
రెండో దశలో ఆంక్షల ఎత్తివేత..
ఇక రెండో దశలో కరోనావైరస్ ముప్పు ఉన్నవారందరినీ ఇంటికే పరిమితం చేయడం, ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రోత్సహించడం. ఎక్కువ సంఖ్యలో పనిచేసే ప్రదేశాలు మాత్రం మూసివేసే ఉంచాలి. ఉద్యోగులను సాధారణ ప్రయాణాలకు అనుమతించొచ్చు. సామూహిక ప్రాంతాలను తెరుచుకోవచ్చు. సామాజిక దూరంగా మాత్రం పాటించాల్సిందే.
మూడో దశ లేదంటే..
ఇక మూడో దశలో కరోనావైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని భావిస్తే సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అడ్డంకిగా ఉన్న ఆంక్షలన్నింటినీ తొలగించుకోవచ్చు. అయితే, సామాజిక దూరంతోపాటు పరిశుభ్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. డెబోరా బ్రిక్స్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ మూడో దశల్లో పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రమాణాలను నిర్దేశించింది. కాగా, అమెరికాలో 33 కోట్ల మంది జనాభాలో దాదాపు 95 శాతం మంది ఆంక్షల పరిధిలో ఉన్నారు. ఇప్పటి వరకు అక్కడ ఆరున్నర లక్షల మందికిపైగా కరోనావైరస్ బారిన పడ్డారు. వీరిలో 34వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా రీఓపెన్.. లేదంటే మళ్లీ క్లోజ్
ఇది ఇలా ఉండగా, ఇప్పటికే అమెరికా కరోనా మరణాల విషయంలో గరిష్టస్థాయిని దాటేసిందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇక అమెరికా ప్రజలు తిరిగి తమ జీవితాలను తిరిగి ప్రారంభింంచబోతున్నారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో కరోనా కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అప్పటి వరకు కరోనా నియంత్రణలోకి రాకుంటే మరోసారి ఆంక్షలు పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
Recommended Video