కరోనా విలయం: 100 మంది డాక్టర్లు బలి.. అక్కడేం జరుగుతుంతో తెలిస్తే షాక్..
మనమంటూ బతికుంటేనే నలుగురికీ సహాయ పడగలం.. మరి మన బతుకే ప్రమాదంలో పడితే? రెండో ఆలోచన లేకుండా సొంత సేఫ్టీకే ప్రాధాన్యత ఇస్తాం. కరోనా వైరస్ విజృంభణ తర్వాత పక్కింటోడితో చెయ్యి కలపడానికే జంకుతున్న రోజులివి. దేశాలకు దేశాలే సరిహద్దులు మూసుకుని కూర్చున్నాయి. కానీ వాళ్లు ఆ పని చేయలేకపోతున్నారు. వెల్లువలా వచ్చిపడుతోన్న నిర్భాగ్యుల్ని వెళ్లగొట్టలేక ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఈ విలయకాలంలోనూ మనవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు. ఆ చోటు.. ప్రస్తుతానికి భూమ్మీద మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ డెడ్లీయెస్ట్. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 మరణాలు చోటుచేసుకున్న దేశమది. అవును, మనం చెప్పుకుంటున్నది ఇటలీ గురించే.
మృత్యుకౌగిలిలోకి..
విపత్తులు, సంక్షోభాల తర్వాత జనజీవితాలు ఎంత దారుణంగా మారిపోతాయో మిడిల్ ఈస్ట్, నార్త్, ఈస్ట్ ఆఫ్రికా దేశాలను చూస్తే తెలుస్తుంది. పిల్లలతోసహా పొట్టచేతపట్టుకుని వాళ్లంతా రబ్బరు, చెక్క బోట్లలో సముద్రంగుండా యూరప్ దేశాలకు శరణార్థులుగా వలసపోతున్న దృశ్యాలు మనమెన్నో చూశాం. కరోనా విలయం తర్వాత కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. లిబియా, టాంజానియా, సిరియా లాంటి దేశాల నుంచి ఇవాళ్టికి కూడా ఇటలీకి శరణార్థులు వస్తూనే ఉన్నారు. అసలే వేల మందిని పోగొట్టుకుని పుట్టెడు దుఖ:లో ఉన్న ఇటలీ.. కొత్తగా వచ్చిపడుతోన్న నిర్భాగ్యుల్ని కాదనలేకపోతున్నది. అలాంగని కరోనా మృత్యుకౌగిలిలోకి ఆహ్వానించనూ లేకపోతున్నది. ‘‘వాళ్లు బతుకు కోసం వెతుకులాడుతూ వచ్చారు. వాళ్లనలా నీళ్లలోనే గాలికొదిలెయ్యలేము కదా..''అని తీర పట్టణం లంపెడుసా సిటీ మేయర్ సాల్వటోర్ మార్టెలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదేశాలు వచ్చినా..
మొన్నటిదాకా శరణార్థుల సంరక్షణను ఇటలీ ప్రభుత్వమే చూసుకునేది, కానీ ఇప్పుడు అధికారయంత్రాంగమంతా కరోనా పోరులో బిజీ అయిపోయింది. దీంతో స్వచ్చంత సంస్థలు.. సముద్రం తీరాలకు వచ్చే శరణార్థుల్ని కాపాడుతున్నాయి. కొద్ది గంటల కిందటే దేశంలోని అన్ని పోర్టుల్ని మూసేయాలని, ఎన్జీవోల పడవలను కూడా వెళ్లనీయొద్దని ఇటలీ కేంద్ర సర్కారు తీర్మానించింది. కానీ స్థానిక ప్రభుత్వాలు ఆ ఆదేశాలను కరాఖండిగా అమలుచేయలేకపోతున్నాయి. స్థానిక కోస్టు గార్డులు.. ఎన్జీవోల పనికి ఆటంకం కలిగించకుండా చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. ప్రమాదకరమని తెలిసీ, తోటి మనుషులకు సాయం చేయడాన్ని ఏమంటారో మీరే నిర్ణయించాలి. ఇటు చూస్తే,
మరణాల్లో రికార్డులు..
ఇద్దరు చైనీస్ టూరిస్టుల ద్వారా రోమ్ సిటీలో అంటుకున్న కరోనా వైరస్.. రోజుల వ్యవధిలోనే ఇటలీని రోగుల మయంగా మార్చేసింది. అతి వేగంగా, అత్యంత భయానకంగా పరిస్థితులు దిగజారాయక్కడ. కరోనా కేసులు, మరణాల లెక్కల్లో రోజుకో రికార్డు సాధిస్తున్న ఇటలీలో శుక్రవారం నాటికి మొత్తం 18,279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే హయ్యెస్ట్ నంబర్. ప్రస్తుతానికి అక్కడ మరో 1లక్ష యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 4వేల మంది కండిషన్ క్రిటికల్ గా ఉంది. మరీ దారుణమేంటంటే, చనిపోయినవాళ్లలో హెల్త్ డిపార్ట మెంట్ కు చెందినవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉండటం.
100 మంది డాక్టర్లు..
ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద ఎకానమీగా, ఆరో ధనవంతమైన దేశంగా విలసిల్లిన ఇటలీలో అసలు లోపాలు కరోనా విలయం తర్వాతగానీ బయటపడలేదు. కొవిడ్-19 రోగులకు సేవలందించే డాక్టర్లు, నర్సులకు కనీస రక్షణ సదుపాయాలు కూడా లేవు. బయటి దేశాల నుంచి తెప్పించుకునేలోపే పరిస్థితి ముదిరింది. మరే దేశంలోనూ లేని విధంగా ఇటలీలో ఇప్పటిదాకా 100 మంది డాక్టర్లు కరోనా కాటుకు బలయ్యారు. వాళ్లతోపాటు 30 మంది నర్సులు కూడా చనిపోయారని ప్రఖ్యాత ఆరోగ్య సంస్థ FNOMCeO ప్రకటించింది. ‘కనీస రక్షణ కవచాలు లేకుండా కొవిడ్ తో డాక్టర్లను యుద్ధానికి దింపిన ఫలితమే ఇది' అని ఆరోగ్య సంస్థ ప్రతినిధి వాపోయారు. ఇక, ఇటలీకంటే ఎన్నోరెట్లు శక్తిమంతమైన, ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలో..
ఒక్కరోజులో 1783 మరణాలు..
మరణాల సంఖ్యలో అమెరికా.. ఇటలీతో పోటీపడుతున్నది. అగ్రరాజ్యంలో శుక్రవారం ఉదయం నాటికి 16,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే యాక్టివ్ గా ఉన్న 4.26లక్షల కేసుల్లో 10వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. దురదృష్టవశాత్తూ మరణాల సంఖ్యలోనూ అమెరికా ఇటలీని మించిపోయే పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో నిరుద్యోగం మునుపెన్నడూ లేనంత స్థాయికి పెరిగింది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత కూడా ప్రపంచం కోలుకోడానికి ఏళ్లు పడుతుందన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా హెచ్చరిక ప్రభావం ముందుగా అమెరికాలోనే కనిపిస్తుండటం గమనార్హం.
అక్షరాలా లక్షకు చేరువగా..
దాదాపు 200 దేశాల్లో విలయతాండం చేస్తోన్న కరోనా వైరస్ ఇప్పటికే 96 వేల మందిని బలితీసుకుంది. వైరస్ సోకిన 16లక్షల మందిలో వేలాది మంది పరిస్థితి విషమంగా ఉండటాన్ని బట్టి మరణాల సంఖ్య కొద్ది గంటల్లోనే లక్ష దాటే అవకాశముంది. ఇప్పటిదాకా వ్యాధి నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 3.5లక్షలుగా ఉంది. ఇటలీ, అమెరికాతోపాటు స్పెయిన్ 15,500 మరణాలు, ఫ్రాన్స్ 12వేల మరణాలతో మోస్ట్ ఎఫెక్టెడ్ గా కొనసాగుతున్నాయి. ఇరాన్ లో 4,100 దగ్గరే మరణాలు ఆగిపోయినా, 66వేల పైచిలుకు కేసులు కలవరపెడుతున్నాయి. మిగతా యూరప్ దేశాలకు భిన్నంగా జర్మనీలో మరణాల రేటు తక్కువగా ఉంది. అక్కడ 1.2లక్షల కసులుండగా, 2,607 మంది చనిపోయారు. అదే బ్రిటన్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేల లోపే ఉన్నా సుమారు 8 వేల మంది కన్నుమూయడం విషాదకరం.
Recommended Video