coronavirus: 2 నెలల్లో చైనా సేఫేస్ట్ ప్లేస్, డ్రాగన్ నుంచి కరోనా ఔట్, షిప్ కెప్టెన్ నెల్సన్ ధీమా..
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ నియంత్రణ కోసం డ్రాగన్ చైనా గట్టి చర్యలు తీసుకున్నది. దీంతో వైరస్ ఆవిర్భవించిన వుహాన్ సహా చైనాలోని ఇతర ప్రాంతాల నుంచి వైరస్ తగ్గుతోంది. పాజిటివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చైనా సమీపంలో గల గ్రీస్ కంపెనీ షిప్లో పనిచేస్తున్న భారత్కు చెందిన నెల్సన్ పాలుపల్లి.. చైనాలో ఏం జరుగుతుందో అనే విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. అంతేకాదు రెండు నెలల్లో కరోనా వైరస్ను చైనా తరిమికొడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈస్ట్ కాంగ్లో షిప్
నెల్సన్ పాలుపల్లి, తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యక్తి. గ్రీస్ దేశానికి చెందిన షిప్లో కెప్టెన్గా పనిచేస్తున్నారు. వారి షిప్ షాంగైకి 100 కిలోమీటర్ల దూరంలో గల ఈస్ట్ కాంగ్లో నిలిచి ఉంది. తమ ఓడ ఇక్కడే ఉందని, తమకు ఎలాంటి భయం లేదని చెప్తున్నారు. తమ షిప్పులో కూడా 100 మంది చైనా దేశానికి చెందినవారు ఉన్నారని తెలిపారు. ప్రతీరోజూ 50 మందితో తాను ఇంటరాక్ట్ అవుతానని పేర్కొన్నారు. తమ ఓడలో జీరో ఇన్ ఫెక్షన్.. ఒక్కరికీ కూడా వైరస్ లేదని నెల్సన్ ధీమాగా చెప్పారు.
కి.మీకు 10 చెక్ పోస్టులు
అందరం షిప్లోనే ఉంటున్నామని నెల్సన్ తెలిపారు. బయటకు వెళ్లాలంటే చైనా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీంతో షాపింగ్ మాల్, రెస్టారెంట్ ఇతర చోటకు వెళ్లే వీలులేదన్నారు. షిప్ ఉన్న పోర్టులో కిలోమీటర్ మేర తిరగాలి అన్న.. పది చెక్ పోస్టులు ఉంటాయని తెలిపారు. వారు చెక్ చేస్తారని.. 37 డిగ్రీలు, 98 టెంపరేచర్ దాటితే చాలు.. వెంటనే ఐసోలేసన్కు పంపిస్తారని తెలిపారు. వారిపై వైరస్ ప్రభావం తగ్గేవరకు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తారన్నారు.
14 రోజులు ఐసోలేసన్, 6 సార్లు పరీక్షలు
ఇటీవల గ్రీన్ నుంచి ఒకరు వచ్చారని నెల్సన్ తెలిపారు. అతనిని ఒక హోటల్లో పెట్టి ఐసోలేషన్ చేశారని.. 14 రోజుల తర్వాత తమ వద్దకు వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారని పేర్కొన్నారు. అలా పంపించే ముందు కూడా ఆరు సార్లు పరీక్షలు నిర్వహించి.. నెగిటివ్ వచ్చాకే పంపించారని తెలిపారు. ఇంత కఠినంగా ప్రవర్తించడంతో చైనాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని వివరించారు.
Recommended Video
45 రోజులు కర్ఫ్యూ
చైనాలో వైరస్ ఎక్కువగా ఉన్నచోట 45 రోజులు కర్ప్యూ విధించారని నెల్సన్ గుర్తుచేశారు. చాలా కంపెనీల్లో తక్కువమందితో పనిచేయించారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు తీసుకోవడంతో చైనాలో వైరస్ కనుమరుగు అవుతోందన్నారు. మరో రెండు నెలల్లో చైనాలో కరోనా వైరస్ కనిపించదని స్పష్టంచేశారు. మిగతా దేశాలు వైరస్ బారిన ఇబ్బంది పడుతుంటే.. తర్వాత మాత్రం చైనా సురక్షితమైన ప్రాంతంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.