సముద్రంలో నిర్బంధంలో ఉన్న మరో భారతీయుడికీ కరోనా వైరస్.. పరిస్థితి భయానకం
చైనా బయట అతిపెద్ద కరోనా క్లస్టర్ గా గుర్తింపు పొందిన 'డైమండ్ ప్రిన్సెస్' లగ్జరీ నౌకలో మరో భారతీయుడికీ కోవిడ్-19 వ్యాధి(కరోనా వైరస్ ద్వారా వచ్చే వ్యాధి)కి గురయ్యాడు. జపాన్ లోని యోకోహామా తీరంలో ఈ నెల ఐదు నుంచి డైమండ్ ప్రిన్సెస్ నౌకను అక్కడి ప్రభుత్వం క్వారంటైన్ (తప్పనిసరి నిర్బంధం)లో ఉంచింది. వైరస్ కారణంగా లోపలున్న 3600 మందిని బయటికి రానివ్వడంలేదు. నౌకలో చిక్కుకుపోయిన 138 మంది భారతీయుల్లో 132 మంది షిప్పులో పనిచేసే సిబ్బందేకాగా, ఆరుగురు మాత్రం ప్రయాణికులు.
భారత ఎంబసీ ప్రకటన
గురువారం నాటికి ఇద్దరు భారతీయులకు కరోనా సోకినట్లు గుర్తించగా, శుక్రవారం మరొకరి టెస్టులు పాజిటివ్ గా తేలింది. క్వారంటైన్ లో ఉంచి షిప్పులోని భారతీయుల పరిస్థితిపై జపాన్ లోని ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తోంది. మూడో వ్యక్తికి కూడా వైరస్ సోకిన విషయాన్ని కూడా ఎంబసీనే ప్రకటించింది. చికిత్స నిమిత్తం వారిని టోక్యోలోని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం ఆ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంబసీ తెలిపింది.
170 మందికి సోకింది..
హాంకాంగ్ లో దిగిపోయిన 80 ఏళ్ల ఒక వృద్ధుడి ద్వారా ‘డైమండ్ ప్రిన్సెస్' నౌకలోకి కరోనా వైరస్ ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. నౌకలోని 3600 మందిలో 170 మందికిపైగా వైరస్ బారిన పడినట్లు చెప్పారు. వాళ్లందరినీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. జపాన్ లో ‘డైమండ్ ప్రిన్సెస్' నౌక లాగే తూర్పు ఆసియాలోని వివిధ దేశాల తీరాల్లో ఇంకొన్ని నౌకల్ని క్వారంటైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
చైనాలో ఆగని మరణాలు..
కరోనా వైరస్ పుట్టిన చైనాలో పరిస్థితి రోజురోజుకూ భయానకంగా మారుతోంది. శుక్రవారం నాటికి దాదాపు 1600 మంది వైరస్ కారణంగా చనిపోయినట్లు సమాచారం. దాదాపు లక్ష మంది వరకు అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలో మీడియాపై ఆంక్షల కారణంగా అక్కడేం జరుగుతోందనే విషయం బయటి ప్రపంచానికి పెద్దగా తెలియడంలేదు. వూహాన్ లో కరోనా ఘోరకలిపై వీడియోలు చేసిన ఇద్దరు సిటిజన్ జర్నలిస్టుల్ని ప్రభుత్వం నిర్భంధించింది.