నేను చనిపోతే ఎలా అనే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి బారిన పడి చివరి వరకు పోరాడి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. అయితే, కరోనాతో పోరాడుతున్న సమయంలో ఒకవేళ తాను చనిపోతే ఆ వార్తను బయటి ప్రపంచానికి ఎలా తెలియజేయాలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యులు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారని స్వయంగా బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
Recommended Video
చాలా కష్టంగా..
ఏప్రిల్ 5న కరోనా సోకడంతో లండన్లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చేరిన జాన్సన్.. ఏప్రిల్12న సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చారు. ఆ సమయంలో ఆస్పత్రిలో చాలా కష్టంగా గడిచిందని తన అనుభవాలను చెప్పుకొచ్చారు. దాదాపు మరణం అంచుల వరకు వెళ్లినట్లు తెలిపారు. ‘ది సన్' అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు.
అవన్నీ చేదు జ్ఞాపకాలు..
వైద్యులు లీటర్ల కొద్దీ ఆక్సిజన్ ఖర్చు చేస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించకపోయే సరికి.. తాను మరణిస్తాననే అంచనాకు వైద్యులు వచ్చారని చెప్పారు. అయితే, ఆ విషయాన్ని ఎలా బయటకు చెప్పాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని.. అది తనకు అర్థమవుతూనే ఉందని తెలిపారు. అవన్నీ ఓ చేదు జ్ఞాపకాలు అంటూ బోరిస్ జాన్సన్ భావోద్వేగానికి గురయ్యారు.
వారికి ఎప్పటికీ కృతజ్ఞుణ్ని..
ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో చాలా ఆందోళన కలిగిందని, ఎందుకు కోలుకోలేకపోతున్నానో తనకు అర్థం కాలేదని తెలిపారు. తన వాయునాళంలో ప్రత్యేక ట్యూబ్ అమర్చుదామా అనే వరకు వెళ్లిందని.. అలాంటి పరిస్థితుల నుంచి తనను పూర్తిస్థాయి ఆరోగ్యవంతుడిగా వైద్యులు తీసుకొచ్చారని జాన్సన్ తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే తాను కోలుకున్నానని చెప్పారు. తానువారికి ఎప్పటికీ కృతజ్ఞుణ్ని అంటూ వైద్యులపై ప్రశంసలు కురిపించారు.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు..
గతంలో తాను అనేకసార్లు గాయపడ్డానని కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పడూ ఎదుర్కోలేదని చెప్పారు. తనతోపాటు చికిత్స పొందుతున్నవారు కోలుకుని వెళ్ళిపోతున్నా.. తాను అలాగే ఉండటం బాధేసిందని అన్నారు. అయితే తాను కరోనాను గెలుస్తాననే నమ్మకమైతే ఉండేదని అన్నారు బోరిస్ జాన్సన్. కాగా,తన చికిత్సలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వైద్యులకు గుర్తుగా తన కుమారుడికి వారి పేరుతో నామకరణం చేసినట్లు బోరిస్ తెలిపారు.