చైనాకు రిలీఫ్-ట్రంప్కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?
జెనీవా: కరోనావైరస్(కొవిడ్-19) అనేది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు తీస్తున్న ఓ మహమ్మారి. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పి వరకు సుమారు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చైనాదే బాధ్యతంటూ..
చైనాలో ఈ వైరస్ పుట్టిన నేపథ్యంలో అమెరికా ఈ మహమ్మారిని చైనా వైరస్ అని పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, చైనా మాత్రం దీన్ని ఖండిస్తోంది. తాము కావాలని ఏమీ ఈ వైరస్ ను సృష్టించలదేని, సహజంగానే ఈ వ్యాధి వ్యాపిస్తోందని స్పష్టం చేసింది. అయినా కూడా చైనా ఏదో దాస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్కు చైనానే బాధ్యత వహించాలంటూ అమెరికా సహా పలు దేశాలు మండిపడుతున్నాయి.
జంతువుల వల్లే..
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు స్పష్టతనిచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మరోసారి ఈ విషయంపై స్పందించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్ పుట్టుకకు కారణం జంతువులేనని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం కరోనా చైనాలో జంతువుల నుంచి సంక్రమించిందని వెల్లడించింది. కరోనావైరస్ ల్యాబ్లో సృష్టించింది కాదని మరోసారి స్పష్టం చేసింది.
గబ్బిలాలే వాహకాలా..
అయితే, కరోనావైరస్ పుట్టుకకు కారణం జంతువులేనని చెప్పిన డబ్ల్యూహెచ్ఓ.. ఇది ఎలా మానవులకు సంక్రమించిందనే దానిపై స్పష్టత రాలేదని తెలిపింది. ఈ వైరస్ వ్యాప్తికి ఏదో ఒక జంతువు వాహకంగా వ్యవహరించి ఉంటుందని, దీని మూలాలు ఎక్కువగా గబ్బిలాల్లోనే ఉన్నాయని తెలిపింది. వాటి నుంచే వైరస్ మనుషులకు ఎలా వ్యాపించిందనే విషయం కన్నుకోవాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి ఫడేలా చైబ్ వెల్లడించారు.
ల్యాబ్ సృష్టిపై అమెరికా దర్యాప్తు..
కాగా, వైరస్ ఏదైనా ల్యాబ్ నుంచి అనుకోకుండా బయటికి వచ్చిందా? అనే ప్రశ్నమకు మాత్రం డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి ఫడేలా స్పందించలేదు. ఇది ఇలావుంటే, కరోనావైరస్ చైనాలోని వూహాన్లో ఉన్న పీ4 లేబొరేటరీ నుంచి పుట్టుకొచ్చిందా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Recommended Video
డబ్ల్యూహెచ్ఓ ప్రకటన హాట్ టాపిక్..
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో డబ్ల్యూహెచ్ఓపైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనావైరస్ వ్యాపిస్తున్నా ప్రపంచాన్ని అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. అంతేగాక, డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి వెళ్లే నిధులను ఆపేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం సరికాదన్న డబ్ల్యూహెచ్ఓ.. నిధుల కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు వెల్లడించింది.