Coronavirus: తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్: అనేక పాఠాలను నేర్పిందంటూ.. !
బీజింగ్: చైనాను చుట్టబెట్టిన ప్రాణాంతక కరోనా వైరస్పై ఆ దేశాధ్యక్షుడు గ్జి జిన్పింగ్ తొలిసారిగా స్పందించారు. చైనాలోని వుహాన్ సిటీ హ్యుబే ప్రావిన్స్ సహా పలు ప్రాంతాల్లో ఏకంగా 2400 మందిని పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారిని ఆయన దేశంలోనే భయానక సంక్షోభంగా అభివర్ణించారు. దేశంలోనే అత్యంత కీలకమైన హెల్త్ ఎమర్జెన్సీగా ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందినట్లు చెప్పారు.
Recommended Video
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ అధికారులతో ఆదివారం ఆయన రాజధాని బీజింగ్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ తమ మేథో శక్తికి పరీక్షలు పెడుతోందని, అనేక పాఠాలను నేర్పిందని అన్నారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. అయినప్పటికీ.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి తాము గట్టెక్కుతామని అన్నారు.
కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని జిన్పింగ్ చెప్పారు. దాని పరిధి ఊహించిన దాని కంటే విస్తృతంగా ఉందని అన్నారు. కరోనా వైరస్కు ఉన్న ఈ రెండు ప్రమాదకరమైన లక్షణాల దాన్ని నియంత్రంచలేకపోతున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి తీసుకున్న అన్ని రకాల చర్యలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడానికి కరోనా వైరస్కు ఉన్న లక్షణాలే కారణమని అభిప్రాయపడ్డారు.
కరోనా వైరస్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపిందని జిన్పింగ్ చెప్పారు. వైరస్ను నియంత్రించడానికి, ప్రజలు ఆ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి పెద్ద ఎత్తున నిధులను వ్యయం చేయాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ.. దాన్ని త్వరలోనే మట్టుబెట్టగలమని అన్నారు. చైనా ఇప్పటికే పదిరోజుల వ్యవధిలో వెయ్యి పడకల భారీ ఆసుపత్రిని నిర్మించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను ఖర్చు చేసిన విషయం తెలిసిందే.