కరోనా ప్రళయం: 50 కోట్ల మంది పేదరికంలోకి! ఐక్యరాజ్యసమితి ఆందోళన, దేశాలకు పిలుపు
వాషింగ్టన్: కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రళయమే సృష్టిస్తోంది. ఓ వైపు వేలాది మంది ప్రాణాలు తీస్తున్న ఈ వైరస్.. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. కరోనావైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాలు లాక్డౌన్ను అమలు చేస్తుండటంతో దాదాపు అన్ని రకాల పరిశ్రమలు ఆగిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు: కరోనా పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ
పేదరికంలోకి 50 కోట్ల మంది..
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది పేదలు పెరిగిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ప్రాణ నష్టంతోపాటు ఆర్థికంగా కూడా భారీగా నష్టపోనుందని స్పష్టం చేసింది. ఇందుకు ప్రపంచ దేశాలు సరైన చర్యలతో ముందుకు వెళ్లాలని సూచించింది.
గత 30 ఏళ్లలో తొలిసారి..
గత 30 ఏళ్లలో ఈ స్థాయిలో పేదరికం పెరిగిపోవడం ఇదే తొలిసారని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికను ప్రస్తావించింది. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), జీ 20 ఆర్థిక మంత్రుల కీలక సమావేశం వచ్చేవారం జరగనున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి తన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. యూనైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ అధ్యయనంలో కింగ్స్ కాలేజీ లండన్, ఆస్ట్రేలియా యూనివర్సిటీ(ఏఎన్యూ) నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు. ఆరోగ్య సంక్షోభం కంటే కూడా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపింది.
దేశాలకు పిలుపు..
ప్రపంచ వ్యాప్తంగా 400-600 మిలియన్ల ప్రజలు కరోనా కారణంగా పేదరికంలోకి నెట్టబడుతున్నారని యూఎన్ స్పష్టం చేసింది. ఈ ప్రభావం భారతదేశంపై ఎక్కువగా ఉండనుందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో 2030కి యూఎన్ పెట్టుకున్న పేదరికాన్ని పారద్రోలాలన్న యూఎన్ లక్ష్యానికి ఈ కరోనా గండికొట్టిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రపంచంలో పేద దేశాలకు రుణాలను మంజూరు చేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా కరోనాపై పోరాటంపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నాయని.. ఇక అభివృద్ధి చెందిన దేశాలు కరోనాపై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలోపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు తమవంతుగా అభివృద్ధి చేయాలని కింగ్స్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ ఆండీ సమ్నర్ తెలిపారు.
కరోనా పేదరికాన్ని మిగిల్చిపోతుంది..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వీడే సమయానికి ప్రపంచ సగం జనాభా సుమారు 7.8 బిలియన్ల ప్రజలు పేదరికంలోకి వెళతారని పేర్కొంది. తూర్పు ఆసియా, పసిఫిక్, సబ్ సహరన్ ఆఫ్రికా, సౌత్ ఆసియాల్లో 40శాతానికి పైగా పేదలుగా మారిపోతారని తేల్చింది. పేద దేశాల అప్పులను మాఫీ చేయడం ద్వారా ఆయా దేశాలకు ఎనలేని మేలు జరుగుతుందని, సుమారు 25 బిలయన్ల నగదు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి ఉపయోగపడుతుందని వెల్లడించింది.