Coronavirus: ఘోస్ట్ టౌన్: 24 గంటల్లో 242 మందిని పొట్టన పెట్టుకున్న మహమ్మారి..!
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన చైనాలో చోటు చేసుకున్న తాజా ఉదంతం మొత్తం ప్రపంచాన్నే వణికించేలా చేస్తోంది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలన్నీ వ్యర్థమేననే సందేశాన్ని ఇచ్చినట్టవుతోంది. వైద్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మృతుల సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. ఈ వైరస్ జన్మించిన హ్యుబే ప్రావిన్స్లో 24 గంటల వ్యవధిలో 242 మంది మరణించారంటే..కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
26/11 ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్కు అయిదేళ్ల జైలు: అమలు చేస్తారా? డ్రామాలకు తెర తీస్తారా?
కొత్తగా 15 వేల మందిలో వైరస్ లక్షణాలు..
వుహాన్ సహా హ్యుబే ప్రావిన్స్లోని పలు నగరాలు, పట్టణాల్లో ఈ మరణాలు సంభవించాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. దీనితో ఇప్పటిదాకా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1355కు చేరిందని పేర్కొంది. కాగా.. ఈ వైరస్ లక్షణాలు కనిపించిన వారి సంఖ్య అరలక్షను దాటిందని వెల్లడించింది. దీనితోపాటు హ్యుబే ప్రావిన్స్లో కొత్తగా 14,840 మందిలో వైరస్ లక్షణాలు కనిపించాయని, వారందరికీ వైద్య చికిత్సను అందిస్తున్నట్లు హ్యుబే హెల్త్ కమిషన్ స్పష్టం చేసింది.
60 వేల మార్క్ను దాటి..
ప్రస్తుతం చైనాలో ఈ ప్రాణాంతక మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య అరలక్షను దాటింది. 60,149 మందిలో వైరస్ లక్షణాలు కనిపించినట్లు హెల్త్ కమిషన్ తాజాగా తన బులెటిన్లో పేర్కొంది. వారందరికీ చికిత్స చేయిస్తున్నామని వెల్లడించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న వారిని వేర్వేరు ఆసుప్రతుల్లో ఉంచి, అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. మరి కొందరిని ప్రత్యేక శిబిరాల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలియజేసింది.
ఘోస్ట్ టౌన్స్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచీ చైనాలోని అనేక పట్టణాలు, నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఘోస్ట్ టౌన్గా తయారయ్యాయి. రోజువారీ అవసరాల కోసం కూడా ప్రజలు రోడ్ల మీదికి రావడానికి వణికిపోతున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం కూడా అడుగు బయట పెట్టలేనంత భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా వాటిని తెప్పించుకుంటున్నారు.
స్తంభించిన రవాణా..
వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాలోని పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వ్యక్తిగత కార్లను కూడా వినియోగించట్లేదు. అన్ని రకాల రవాణా సాధనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను సాగించడం వల్ల కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ సహా పలు దేశాలు చైనాలోని కొన్ని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేశాయి.