కరోనా విలయం: 4వేలకు పెరిగిన మృతులు.. సరిహద్దులు మూసేసి భారత్.. వైరస్ను నిర్మూలించామన్న చైనా..
దేశంలో కరోనా వైరస్ లేనేలేదని పాలకులు భరోసా కల్పిస్తున్నప్పటికీ.. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య 58కి పెరిగింది. చైనా చుట్టుపక్కల దేశాల్లో వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం మణిపూర్ లోని మయన్మార్ సరిహద్దుల్ని మూసేసింది. మంగళవారం నుంచి తదిపరి ఆదేశాలు వెలువడేదాకా నిషేధం అమలవుతుందని అధికారులు చెప్పారు.
మరణమృదంగం..
ఇండియాలో వ్యాపారాలకు భారీ నష్టం తప్ప ప్రాణాపాయం లేనప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు మంగళవారం నాటికి 4,030కు పెరిగాయి. వైరస్ సోకినవాళ్ల సంఖ్య కూడా 1.14 లక్షలకు పెరిగింది.చైనా తర్వాత ఎక్కువగా ఎఫెక్టయిన ఇటలీ, ఇరాన్ లో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇరాన్ లో గత 24 గంటల్లోనే 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఆదేశంలో కరోనా మరణాల సంఖ్య 290కి పెరిగింది. ఇటలీలో ఇప్పటివరకు 463 మంది చనిపోగా, మరో 9వేల మంది వైరస్ బారినపడి చికిత్స పొందుతున్నారు.
64వేల మంది కోలుకున్నారు..
కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్తను వెల్లడించింది. ఈ వైరస్ ఎంతో వేగంగా 100 దేశాలకు విస్తరించిచి లక్ష మందికిపైగా సొకినప్పటికీ.. చికిత్సతో కోలుకుంటున్నవాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపింది. మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినవాళ్లలో 64 వేల మందికి నయమైందని అధికారులు వెల్లడించారు.
దేశం నలువైపులా వైరస్..
మంగళవారం నాటికి మన దేశంలో నలువైపులా కరోనా పాజిటివ్ కేసులు 58 నమోదయ్యాయి. తాజాగా వెలుగులోకి వచ్చినవాటిలో అత్యధికంగా కేరళలో 12 కేసులుండగా, మహారాష్ట్రలో 2, కర్నాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్ తోపాటు లదాక్ కేంద్రపాలిత ప్రాంతంలోనూ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి, నిరోధక చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ వరుస సమావేశాలు నిర్వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్య అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరాన్ లో చిక్కుకుపోయిన 58 మంది భారతీయులను ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా స్వదేశానికి రప్పించినట్లు అధికారులు తెలిపారు. వాళ్లందరినీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి పరీక్షలు చేస్తున్నామన్నారు.
చైనా అధ్యక్షుడి అనూహ్య ప్రకటన..
ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనా వైరస్ కు సంబంధించి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అనూహ్య ప్రకటన చేశారు. వైరస్ పుట్టిన వూహాన్ సిటీలో మంగళవారం ఆయన పర్యటించారు. హుబే ఫ్రావిన్స్ అధికారులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వూహాన్ లో వైరస్ ను సమూలంగా నిర్మూలించామని చెప్పారు. అంటే, చైనా నుంచి వైరస్ వ్యాప్తి ఆగిపోయినట్లేనని, అయితే ఇప్పటికే వైరస్ సోకినవాళ్లద్వారా మాత్రమే అది వ్యాప్తి చెందుతున్నదని వివరించారు. చైనా చీఫ్ ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలు స్పందించాల్సిఉంది.