కరోనా ఎఫెక్ట్ : మంకీ వార్.. ఒక్క అరటిపండు కోసం కొట్టుకున్న వందల కోతులు..
చైనాలోని వుహాన్ పట్టణం నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని ఎంతలా అతలాకుతలం చేస్తోందో తెలిసిందే. కరోనా కారణంగా కేవలం మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బందిపడుతున్నాయి. ముఖ్యంగా టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో.. అక్కడ సంచరించే కోతులకు తిండి పెట్టేవారు కరువయ్యారు. దీంతో ఆకలితో అలమటిస్తోన్న కోతులు.. కంటికి ఏ చిన్న ఆహార పదార్థం కనిపించినా.. గుంపులు గుంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. ఆహారం కోసం వాటిల్లో అవే కొట్టుకుంటున్నాయి. తాజాగా థాయిలాండ్లో లోబ్పురిలో చోటు చేసుకున్న ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
ఏం జరిగింది..
తరుచూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ఈసారి థాయిలాండ్లోని లోబ్పురిలో చోటు చేసుకున్న ఓ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వందలాది కోతులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఒకదానితో ఒకటి కలబడటం అందులో కనిపిస్తోంది. ఈ మంకీ వార్కి కారణం.. ఆ కోతులంతా తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా కొన్నిరోజులుగా థాయిలాండ్కి టూరిస్టుల సంఖ్య తగ్గిపోవడంతో వీటికి తిండి పెట్టేవారు లేకుండా పోయారు.
ఒక్క అరటిపండు కోసం..
ఆకలి తీర్చుకోవాలన్న కసితో ఉన్న సమయంలో.. రోడ్డుపై ఉన్న కోతి చేతిలో ఒక అరటిపండు కనిపించింది. అంతే కోతుల దండు అమాంతం ఆ కోతిపై దాడి చేసి అరటిపండును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఒక్క అరటిపండు కోసం వందలాది కోతులు పరస్పరం దాడులు చేసుకోవడం చాలామందిని షాక్కి గురిచేసింది. ఎంత ఆకలితో ఉంటే.. ఒక్క అరటిపండు కోసం ఆ కోతులు ఇంతలా దండయాత్ర చేస్తాయని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టెంపుల్ మంకీస్ Vs సిటీ మంకీస్
బ్యాంకాక్ పోస్ట్ కథనం ప్రకారం.. అక్కడి కోతుల్లో రెండు గ్యాంగ్స్ ఉన్నాయి. ఒకటి టెంపుల్ మంకీస్.. రెండు సిటీ మంకీస్. సాధారణ రోజుల్లో అయితే థాయిలాండ్ ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడుతుంటుంది కాబట్టి.. టూరిస్టుల నుంచి వీటికి కడుపు నిండా తిండి దొరుకుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చూద్దామన్నా.. రోడ్డుపై కనీసం ఒక్కరూ కనిపించడం లేదు. దీంతో తిండి కోసం రెండు మంకీ గ్యాంగ్స్ ఒకదానిపై ఒకటిపై దాడులు చేసుకుంటున్నాయి. ఏ గ్యాంగ్కి తిండి దొరికినా.. అవతలి గ్యాంగ్ ప్రత్యర్థిని ఎటాక్ చేస్తోంది.
వీడియో తీసిందెవరు...
అన్లూకర్ ససలుక్ రట్టనచై అనే మహిళ ఈ మంకీ వార్ను తన సెల్ఫోన్లో బంధించింది. తన షాప్ ఎదుటే ఈ మంకీ వార్ జరగడంతో తన సెల్ఫోన్ కెమెరాతో దాన్ని చిత్రీకరించింది. అనంతరం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. వాటిని చూస్తే కోతుల్లా కాదు.. వీధి కుక్కల్లా కనిపిస్తున్నాయని ఆమె పేర్కొంది. ఒక్క అరటి పండు ముక్క కోసం అవి చేసిన హైరానా ఆశ్చర్యమనిపించిందన్నారు. కోతులు ఇంత ఆగ్రహంతో ఉండటాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. కరోనా వైరస్ కారణంగా టూరిస్టుల సంఖ్య తగ్గిపోవడంతో వాటికి తిండి దొరకట్లేదని చెప్పారు. కరోనా వైరస్ తీవ్రతకు ఇది కూడా అద్దం పడుతోందన్నారు.