మక్కా ఖాళీ: బోసిపోయిన మసీదు..శుక్రవారం నాటి ప్రత్యేక ప్రార్థనలపై సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం
దుబాయ్: ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కా ఖాళీ అయింది. బోసి పోయింది. మక్కా మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలు (తవాఫ్) చేసే లక్షలాది మంది భక్తులతో 24 గంటల పాటూ క్రిక్కిరిసిపోయి కనిపించే మక్కా మసీదు ప్రస్తుతం ఖాళీగా మారింది. ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన కరోనా వైరసే దీనికి కారణం. దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ వ్యాపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల నుంచి వచ్చే భక్తుల వల్ల ఈ వైరస్ మరొకరికి సోకే ప్రమాదం ఉన్నందు సందర్శనను నిలిపివేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం.
లక్షలాది మంది భక్తులతో..
ఉమ్రా యాత్రలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మక్కా మసీదును సందర్శిస్తుంటారు. మసీదు అంతర్భాగంలో ఉన్న కాబా చుట్టూ ఏడుసార్లు తవాఫ్ నిర్వహిస్తుంటారు. ఉమ్రా యాత్రలో భాగంగా సంవత్సరం పొడవునా మక్కా మసీదును సందర్శిస్తుంటారు భక్తులు. దీనికోసం సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రతి సంవత్సరమూ భారీఎత్తున ప్రత్యేక వీసాలను జారీ చేస్తుంటుంది. అన్ని దేశాల నుంచీ భక్తులు ఇక్కడికి చేరుకుంటుంటారు.
కరోనా ప్రభావంతో యాత్ర రద్దు..
తాజాగా- ఈ ఉమ్రా యాత్రను రద్దు చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయమే. అయినప్పటికీ.. కరోనా వైరస్ ప్రభావం తగ్గేంత వరకూ హజ్ యాత్రకు గానీ, ఉమ్రా యాత్రకు గానీ అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్రా యాత్రను రద్దు చేసిన తరువాత శుక్రవారం ప్రార్థనలను నిర్వహిస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
శుక్రవారం నాటి ప్రార్థనలకు ఓకే..
సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ అనుమానాలకు తెరదించింది. శుక్రవారం ప్రార్థనలను నిర్వహించాలని నిర్ణయించింది. స్థానికులకు మాత్రమే మక్కాలో శుక్రవారం నాటి ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు- మక్కా మసీదు మొత్తాన్నీ ప్రక్షాళన చేసింది. కొన్ని గంటల పాటు పారిశుద్ధ్య పనులను మసీదులో నిర్వహించింది. కాబా సహా మసీదు మొత్తాన్ని శుద్ధి చేసింది. ఆ తరువాతే- భక్తులకు అనుమతి ఇవ్వబోతోంది.
Recommended Video
బోసిపోయిన మసీదు..
24 గంటల పాటు కిటకిటలాడే భక్తులతో కనిపించే మక్కా మసీదు, కాబా ప్రదేశం.. బోసిపోయి కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఖాళీగా ఉన్న మక్కా మసీదు ఏరియల్ వ్యూ.. కరోనా వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి గంటకూ అక్కడి సిబ్బంది మసీదును శుభ్రం చేస్తున్నారు. శుక్రవారం నాటి ప్రత్యేక ప్రార్థనల అనంతరం మక్కా మసీదును మళ్లీ మూసివేస్తారని తెలుస్తోంది.