కరోనా: అమెరికాలో కుళ్లిపోతున్న శవాలు.. హీనంగా ట్రక్కుల్లో కుక్కిపెట్టారు.. ట్రంప్పై చైనా ఎదురుదాడి.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 35 లక్షలు, మరణాలు 2.5లక్షలకు చేరగా, ఒక్క అమెరికాలోనే కేసులు 11.6లక్షలు, మరణాలు 68వేలకు పెరిగాయి. ఆదివారం కూడా 1700పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా దెబ్బకు కకావికలమైన అగ్రరాజ్యంలో కనీవినీ ఎరుగని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా చనిపోయినవాళ్ల పట్ల కాస్తో కూస్తో మర్యాదగా ప్రవర్తించే ఆ దేశంలో.. ఇప్పుడు ఫ్యునరల్ హోమ్స్, స్మశానాలు నిండుకోవడంతో పరిస్థితి తలకిందులైంది.
Recommended Video
రిఫ్రిజిరేటర్లు వాడాలని చెప్పినా..
అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ, ఎపిసెంటరైన న్యూయార్క్ లో మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడొక్కచోటే 3లక్షలపైచిలుకు మందికి వైరస్ సోకగా, సుమారు 25వేల మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ స్టేట్ లో అత్యధిక జనాభా ఉండే బ్రూక్లిన్ కౌంటీలో సుమారు 4వేల మంది చనిపోయారు. ఊహించనిరీతిలో మరణాలు పెరగడంతో అక్కడి ఫ్యునరల్ మోమ్స్ లో చోటులేకుండా పోయింది. దీంతో రిఫ్రిజిరేటర్లతో శవాల్ని భద్రపర్చాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కానీ బ్రూక్లిన్ లోని ఓ ఫ్యునరల్ హోం నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత దారుణంగా వ్యవహరించి అడ్డంగా బుక్కైపోయింది.
కుళ్లిన వాసన రావడంతో ఫిర్యాదు..
బ్రూక్లిన్ లో ఆడ్రూ కీక్లే అనే పేరుగల ఫ్యునరల్ హోం.. తన సామర్థ్యాన్ని మించి, కరోనా మృతదేహాల బాధ్యతను తీసుకుంది. తీరా, వాటిని భద్రపర్చడానికి చోటు లేకపోవడంతో, రెండు ట్రక్కుల్లో 100కుపైగా శవాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి, కుక్కిపెట్టింది. రిఫ్రిజిరేషన్ సౌకర్యం కూడా లేకపోవడంతో కొద్ది గంటలకే అవి కుళ్లిపోయాయి. దుర్వాసన రావడంతో ఆ చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా హాహాకారాలు వ్యక్తం కావడంతో అధికారులు సీరియస్ గా స్పందించారు. సదరు ఫ్యునరల్ హో లైసెన్సును రద్దు చేశారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను మరో చోటికి తరలించి, భద్రంగా ఉంచామని, ఆయా కుటుంబీకులను సంప్రదించి, అంత్యక్రియలకు ఏర్పాట్ల చేస్తామని అధికారులు చెప్పారు.
చైనాకు ట్రంప్ వార్నింగ్
కరోనా వైరస్ పుట్టడానికి, ప్రపంచమంతా అది విస్తరించడానికి కారణమైన చైనాకు గట్టిగా బుద్ధి చెబుతామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శిక్షలో భాగంగా చైనాపై భారీగా పన్నుల భారం పెంచుతామని పునరుద్ఘాటించారు. అంతలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) స్పందిస్తూ, కరోనా వైరస్ సహజంగానే ఉద్భవించిందని, ల్యాబ్ లో తయారైంది కాదని మరోసారి క్లారిటీ ఇచ్చింది. వైరస్ నియంత్రణ చర్యల్లో చైనా అనుసరించిన విధానాల్ని మిగతా దేశాలూ ఫాలో కావాలని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. మరోవైపు..
డ్రాగన్ ఎదురుదాడి..
వైరస్ సృష్టికర్త చైనాయేనంటూ ట్రంప్ పదే పదే దాడిచేస్తుండటంతో డ్రాగన్ దేశం తిరగబడింది. ‘‘వన్స్ అపాన్ ఏ వైరస్'' పేరుతో జిన్ పిన్ సర్కారు ఓ విమర్శనాత్మక వీడియోను విడుదల చేసింది. రెండు వర్గాలకు చెందిన బొమ్మలు మాట్లాడుకుంటున్నట్లుగా రూపొందించిన వీడయోలో.. అమెరికా తీరును చైనా ఎండగట్టింది. వైరస్ పై ముందే హెచ్చరించినా వినిపించుకోకుండా, తీరా కేసులు పెరిగిన తర్వాత ట్రంప్ బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారని, ఇంతటి విపర్కర పరిస్థితుల్లో ప్రంపచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపేసి దుర్మార్గానికి ఒడిగట్టారని, స్టే ఎట్ హోం నినాదాన్ని స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా భావించారని, మాస్కుల వాడకంపైనా అమెరికాలో వ్యతిరేక ప్రచారం జరిగిందని, లాక్డౌన్ను అమెరికన్లు ఆటవిక చట్టంగా భావించారంటూ.. రకరకాలుగా చైనా విమర్శలు కురిపించింది.