భారత్-చైనాకు షాకిస్తూ ట్రంప్ అడుగు.. కరోనా లాక్డౌన్ ఎత్తేసిన అమెరికా.. భారీగా కేసులూ గొప్పేనంటూ..
కరోనా మహమ్మారి పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు పేరుతో చైనాను కట్టడి చేస్తోన్న అమెరికా.. ఫార్మా రంగానికి సంబంధించి భారత్కు కూడా భారీ షాక్ తగిలేలా నిర్ణయాలు తీసుకుంది. ఇకపై దేశానికి అవసరమైన అన్ని రకాల మందుల తయారీ సొంతగడ్డపైనే చేపట్టాలన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. అందుకోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. అమెరికా వాడుతోన్న మెడిసిన్స్ తయారీలో 80 శాతం ముడిసరుకు(ఇంగ్రేడియంట్స్) భారత్, చైనా నుంచి దిగుమతి అవుతుండగా, ఇప్పుడా కంపెనీలను సైతం సొంత దేశానికి తరలించాలని, తద్వరా సరికొత్త సప్లై చైన్ సృష్టించాలని ట్రంప్ డిసైడయ్యారు.
Recommended Video
విలయం నేర్పిన పాఠం..
కరోనా దెబ్బకు అన్ని దేశాల ఆరోగ్య వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చైన్ తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అగ్రరాజ్యమైన అమెరికా చివరికి మందుల కోసం ఇతర దేశాలను బెదిరించే స్థాయికి దిగజారాల్సి వచ్చింది. ఈ విలయం నుంచి పాఠాలు నేర్చుకున్న అన్ని దేశాలూ.. దేశీ మార్కెట్లను వృద్ధి చేసుకునే పనిపై ఫోకస్ పెంచాయి. భారత ప్రధాని మోదీ ‘‘వోకల్ ఫర్ లోకల్'' నినాదమిస్తే.. అమెరికాలో ట్రంప్ ఆ పనిని ఇప్పటికే మొదలుపెట్టేశారు.
దేశీ కంపెనీలకు భారీ ఆర్డర్లు..
స్థానికంగా ఔషధాల ఉత్పత్తి ప్రోత్సహించే క్రమంలో లోకల్ కంపెనీలకు భారీగా ఆర్డర్లు ఇస్తూ డాలర్లను పంపింగ్ చేస్తున్నారు ట్రంప్. డ్రగ్స్ తయారీ, సప్లైకి సంబందించి హెల్త్ అండ్ హ్యూమన్ సర్సీసెస్ శాఖలో కీలక విభాగమైన ‘బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ అథారిటీ(బార్డా) సిఫార్సు మేరకు ట్రంప్ సర్కారు.. వర్గీనియాకు చెందిన ఫ్లౌకార్ప్ అనే బయో టెక్ కంపెనీకి 345 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు కేటాయించింది. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలకు ఆర్డర్లు, రాయితీలు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. చైనా, భారత్ ప్రేమయంలేని సరికొత్త సప్లై చైన్ రూపొందించాలని ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలను ఎటువైపునకు దారితీస్తాయో, అమెరికా సర్కారు నిర్ణయాలు భారత్, చైనాపై ఏమేరకు ప్రభావం చూపుతాయో వేచిచూడాలి. ఇదిలా ఉంటే..
ఆగని విలయం.. అయినా ఆంక్షలు బంద్..
కొవిడ్-19 కేసుల్లో ప్రపంచంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో పరిస్థితి విచిత్రంగా తయారైంది. వైరస్ వ్యాప్తికి ఎపిసెంటరైన న్యూయార్క్ లో, దాని తర్వాత తీవ్రంగా ప్రభావితమైన న్యూజెర్సీ, మసాచుసెట్స్, మిచిగన్, జార్జియా తదితర రాష్ట్రాల్లో కేసుల తీవ్రత తగ్గుముఖంపట్టగా.. కొత్తగా టెక్సాస్, నార్త్ కరోలినా, మినెసొటా, ఆరిజోనా, అలబామాలాంటి రాష్ట్రాల్లో వైరస్ భయానకంగా విజృంభిస్తున్నది. బుధవారం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15.7లక్షలుకాగా, అందులో 3.61లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య 94వేలు దాటి లక్ష దిశగా వెళుతున్నది. ఇంతజరుగుతున్నా.. ఆంక్షల సడలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం నాటికి అమెరికాలోని 50 రాష్ట్రాలూ లాక్ డౌన్ ను ఎత్తేశాయి. అంతర్జాతీయ సరిహద్దులు మాత్రం ఇంకా మూసే ఉంచారు.
కేసులే కిరీటమంటూ..
‘‘ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసుల అమెరికాలో నమోదయ్యాయి. నిజం చెప్పాలంటే ఇదేమీ చెడ్డ విషయం కాదు. అన్ని దేశాలకంటే మేమే టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తున్నాం కాబట్టే కేసులు భారీగా నమోదయ్యాయి. దీన్నొక ‘మెడల్ ఆఫ్ హానర్'గా మేం భావిస్తున్నాం. టెస్టుల్లో ముందున్నందుకు గర్వపడుతున్నాం''అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీడియాతో అన్నారు. అమెరికాలో ఇప్పటిదాకా 1.26కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లోనే అక్కడ కొత్తగా 20,260 కేసులు, 1574 మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం.
చైనా ఫైర్..
30 రోజుల్లోగా తీరు మార్చుకోకుంటే శాశ్వతంగా నిధులు ఆపేస్తామంటూ ప్రంపచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన తీరును చైనా తప్పుపట్టింది. వైరస వ్యాప్తిని అరికట్టడంతో ఫెయిలైన ట్రంప్.. నెపాన్ని డబ్ల్యూహెచ్వో, చైనాపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. కరోనా విలయానికి చైనాయే కారణమని, అక్కడేం జరిగిందో దర్యాప్తు చేయించాలన్న ట్రంప్ వాదనకు భారత్ సహా మెజార్టీ దేశాలు మద్దతు పలకడంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తునకు చైనా అంగీకరించడం తెలిసిందే.