Coronavirus:మోడీ గారు మాకు విముక్తి కల్పించండి: వీడియోలో నౌకలో ఇరుక్కున్న భారతీయ సిబ్బంది
యొకహామా: కరోనావైరస్తో జపాన్లో లంగరేసిన డైమండ్ ప్రిన్సెస్ అనే భారీ నౌకలో భారత్కు చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు. తమను కాపాడాల్సిందిగా తెలుపుతూ ఈ భారతీయులు ఒక వీడియోను విడుదల చేశారు. తమిళనాడులోని మదురైకి చెందిన అన్బలగన్ తాము నౌకలో పడుతున్న కష్టాలను వీడియో ద్వారా చూపించాడు. ఇక ప్రయాణికులంతా నౌకలో ఉన్న పై అంతస్తులో ఉన్నట్లు చెప్పారు. ఇక వారి గదుల్లోకే ఆహారం వెళుతోందని గదులు వీడి ఎవరూ బయటకు రావొద్దన్న వార్నింగ్ నౌక సిబ్బంది జారీ చేసిందని చెప్పారు.
ప్రయాణికులపై విధించిన ఆంక్షలు
నౌకలో చిక్కుకుపోయిన ప్రయాణికులపై కూడా నౌక సిబ్బంది ఆంక్షలు విధించారని అన్బలగన్ చెప్పారు. ప్రయాణికులు ఎవరూ గదిని వీడి రావొద్దని చెబుతూనే ఒకవేళ నడవాల్సి వస్తే ఒకరికి ఒకరు ఆరడగుల దూరం మెయింటెయిన్ చేయాలని ఆదేశాలు వెళ్లినట్లు వివరించాడు. అది కూడా కొన్ని నిమిషాలు మాత్రమే నడిచేందుకు అనుమతిస్తున్నారని చెప్పారు అన్బలగన్. ఇక నౌకలోని సిబ్బంది చాలా దగ్గరగా ఉండి పనిచేయాల్సి వస్తుండటంతో కరోనావైరస్ సోకుతుందేమో అన్న భయం కొందరిలో నెలకొందని చెప్పారు. తమను వెంటనే కాపాడి నౌక నుంచి విముక్తి కల్పించాల్సిందిగా భారతీయ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరింది.
బతుకుతామన్న గ్యారెంటీ లేదు
నౌకలో కొన్ని ప్రోటోకాల్స్ను పాటించాల్సి ఉందని, ఒకవేళ ప్రోటోకాల్స్ను ఉల్లంఘిస్తే తమకు ఇక్కడే కాదు మరెక్కడా ఉద్యోగం రాదనే భయం తమలో నెలకొందని బినయ్ సర్కార్ అనే మరో భారతీయ సిబ్బంది తన ఆవేదన వ్యక్తం చేశాడు. అస్సలు బతుకుతామన్న గ్యారెంటీ లేనప్పుడు ఈ ప్రోటోకాల్స్ను పాటించడం వల్ల వచ్చేదేముంది అని మరో వీడియోలో సర్కార్ చెప్పారు. నౌక లంగరేసిన రోజున సిబ్బందికి ఎవరికీ కరోనావైరస్ సోకలేదని చెప్పారు. అయితే ఇప్పుడు 10 మంది సిబ్బందికి పైగా కరోనావైరస్ టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. ఒకవేళ తమకు విముక్తి కలగకుంటే ఇక్కడే ఒకే ప్లేటులో భోజనం చేయడం, మెస్లో తినడం వల్ల చాలా త్వరగా తమకు కరోనా వైరస్ సోకే అవకాశాలున్నాయని అన్బలగన్ చెప్పారు.
అభినందన్ను ఎలా కాపాడారో అలానే మమ్మలను కాపాడండి
ప్రధాని మోడీ తనకు స్ఫూర్తి అని అభినందన్ వర్థమాన్ను ఎలా అయితే పాకిస్తాన్ చెరనుంచి విడిపించారో అలానే తమను కూడా ఈ క్రూయిజర్ నుంచి విడుదల చేయించాలని కోరారు బినియ్ కుమార్ సర్కార్. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్, సూపర్స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, నటులు విజయ్ తలపతి, అజిత్కుమార్లు తాము పడుతున్న కష్టం గురించి మాట్లాడాలని కోరారు. వెంటనే తమను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ తమిళంలో అన్బలగన్ చెప్పారు. ముందుగా ప్రోటోకాల్స్పై మాట్లాడుతున్న వీడియోను బయటకు పంపొద్దని అన్బలగన్ బినయ్ సర్కార్ను కోరారు. అయితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో ఆ వీడియోను సోషల్ మీడియోలో పోస్టు చేశారు.
డైమండ్ ప్రిన్సెస్ అనే ఈ క్రూయిజర్ 2500 మంది ప్రయాణికులు 1000 మంది సిబ్బందితో జపాన్లోని యొకొహామా పోర్టులో ఫిబ్రవరి 4 నుంచి లంగరేసి ఉంది. రోజూ ప్రయాణికులకు కరోనావైరస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యేవరకు ఎవరూ నౌక వీడి వెళ్లరాదని నౌకాసిబ్బంది ఆదేశాలు జారీచేసింది. సోమవారం రోజున 135 మంది ప్రయాణికులకు పాజిటివ్గా వచ్చింది.