Coronavirus:బ్రెజిల్ అధ్యక్షుడికీ పాజిటివ్, కరోనా బారిన పడిన దేశాల ప్రముఖులు వీరే
లండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతోంది. పలు దేశాధినేతలకు కూడా కరోనా బారినపడుతుండటం ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతకుముందే ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా భేటీ అవడం గమనార్హం.
ఇది ఇలావుండగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగొరీకి కూడా కరైనా వైరస్ సోకింది. గురువారమే ఆమెకు ఫ్లూ సంబంధిత లక్షణాలు ఉండటంతో ఇంటికే పరిమితమయ్యారు. ట్రూడో సైతం ఇంటి నుంచే విధులు నిర్వహించారు.
తన భార్యకు వైరస్ లక్షణాలు ఉండటంతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు ట్రూడో తెలిపారు. కాగా, సోఫీ ఇటీవలే బ్రిటన్లో ఓ కార్యక్రమానికి హాజరై వచ్చారనీ.. అక్కడే ఆమెకు కరోనావైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా, కెనడాలో ఇప్పటి వరకు 138 మందికి కరోనా సోకింది.
ఇక ఆస్ట్రేలియాలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్ దుట్టన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అమెరికా పర్యటన నిమిత్తం ఐదు రోజుల కిందట అక్కడకు చేరుకున్న ఆయన.. వివిధ దేశాధినేతలతో ఆయన భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె అయిన ఇవాంకా ట్రంప్తోనూ ఆయన సమావేశం కావడం గమనార్హం. అయితే, అమెరికా పర్యటన ముగించుకుని శుక్రవారం నాడు స్వదేశానికి చేరుకున్న మంత్రికి అక్కడి వైద్యులు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయనను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.