CoronaVirus: 82 మంది ప్రాణాలను తీసిన డెడ్లీ వైరస్: చైనా నుంచి భారతీయులను, విద్యార్థుల తరలింపు!
Recommended Video
బీజింగ్: చైనాను చుట్టుముట్టేసిన ప్రాణాంతక వైరస్.. కరొనా జనం ఉసురు తీస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 82 మంది మరణించారు. మరో 2,700 మందిలో వైరస్ జాడలు కనిపించాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యపడట్లేదు. ఈ వైరస్.. దాదాపు అన్ని ప్రావిన్స్లకూ విస్తరించిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
బీజింగ్లో తొలి మరణం..
కరోనా వైరస్ బారిన పడి రాజధాని బీజింగ్లో ఓ వ్యక్తి మరణించారు. బీజింగ్లో నమోదైన తొలి మరణం ఇది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తోన్న వుహాన్ నుంచి ఈ నెల 8వ తేదీన బీజింగ్ వచ్చారాయన. అనంతరం.. వారంరోజుల పాటు తీవ్ర జ్వరానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. బీజింగ్లో సంభవించిన తొలి కరోనా వైరస్ మృతిగా భావిస్తున్నారు అధికారులు. వైరస్ను నియంత్రించడానికి చర్యలు చేపట్టారు.
వుహాన్ నుంచి భారతీయుల తరలింపు..
వుహాన్, హ్యుబే ప్రావిన్స్లో నివసిస్తోన్న ప్రవాస భారతీయులందరినీ సురక్షిత ప్రదేశానికి లేదా స్వదేశానికి తరలించడానికి యుద్ధ ప్రాతిపదికన ఇరు దేశాల అధికారులు చర్యలు చేపట్టారు. దీనికోసం బీజింగ్లో రెండు దేశాల రాయబార కార్యాలయ అధికారులు సమావేశం అయ్యారు. వుహాన్లో మొత్తం 250 మంది వరకు ప్రవాస భారతీయులు నివసిస్తున్నట్లు గుర్తించారు. వారందరినీ.. వారు కోరుకున్న ప్రాంతానికి గానీ, స్వదేశానికి గానీ తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. చైనాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను కూడా తరలించే ఏర్పాట్లు చేపట్టారు.
నాలుగు రోజుల్లో 17 నగరాలకు..
అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ క్రమంగా చైనాను చుట్టుముట్టేస్తోంది. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో 17 నగరాలకు ఈ వైరస్ విస్తరించినట్లు చైనా అధికారులు నిర్ధారించారు. వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్న నగరాల్లో ముందు జాగ్రత్త చర్యగా చైనా అధికారుల ప్రజా రవాణా వ్యవస్థను రద్దు చేశారు. దూర ప్రాంతాల నుంచి బీజింగ్కు చేరుకునే బస్సులను సైతం రద్దు చేశారు. అత్యంత వేగంగా ఈ వైరస్ ప్రబలిపోతున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు.
సరిహద్దుల్లో హెల్త్ క్యాంపులు..
చైనాతో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. చైనా, నేపాల్, భూటాన్, మియన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున వైద్య నిపుణులను మోహరింపజేసింది. నేపాల్ సరిహద్దుల్లోనూ హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పానీట్యాంకీ, ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దులపైనా నిఘా ఉంచినట్లు తెలిపింది.