ట్రంప్కు షాక్: చైనా అధ్యక్షుడిపై కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసలు: ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు మరోసారి యాక్టివ్ అయ్యారు. నిన్నమొన్నటి వరకు చనిపోయారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమై ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చేశారు.
Recommended Video
చైనాపై కిమ్ ప్రశంసలు..
ఈ నేపథ్యంలో మరోసారి ప్రపంచం ముందుకు వచ్చిన కిమ్ జోంగ్ ఉన్ చైనాపై ప్రశంసలు కురిపించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో చైనా విజయం సాధించిందని అన్నారు. కరోనా కట్టడి చేసిన తీరు అభినందనీయమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు ఓ సందేశాన్ని పంపారు. జిన్ పింగ్ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ ఆకాంక్షిస్తున్నట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.
చైనా నుంచే వైరస్..
20 రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చిన అనంతరం చైనాను ప్రశంసిస్తూ కిమ్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనావైరస్ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది మరణించారు. మరో 40 లక్షల మంది వరకు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ట్రంప్కు షాకిస్తూ.. కిమ్ వ్యాఖ్యలు..
చైనాలో కరోనాతో 4633 మంది మరణించగా, 82, 800 మంది బాధితులుగా ఉన్నారు. కాగా, చైనాతో కీలక వ్యాపార భాగస్వామిగా ఉన్న ఉత్తరకొరియాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ విషయంపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతేగాక, కరోనాను సృష్టించి ప్రపంచ దేశాలపైకి ఉసిగొల్పిందంటూ చైనా అమెరికా ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో కిమ్ చైనాపై చేసిన ప్రశంసలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా కరోనా తీవ్రతకు సంబంధించిన విషయాన్ని దాచి ప్రపంచానికి భారీ ఎత్తున నష్టాన్ని కలిగించిందంటూ ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ లేదా అగ్రరాజ్యం ఏ విధంగా స్పందిస్తునేది చర్చనీయాంశంగా మారింది.