కరోనా లాక్ డౌన్.. 'ఎయిడ్స్' నివారణకు గేమ్ చేంజర్.. అరుదైన అవకాశం..
కరోనా కారణంగా ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. వైరస్ కారణంగా ప్రత్యక్షంగా చాలా నష్టం జరుగుతున్నప్పటికీ.. పరోక్షంగా కొంత మేలు కూడా జరుగుతోంది. ఇంత కాలం మనుషులు సృష్టించిన విపరీత కాలుష్యానికి దెబ్బతిన్న ప్రకృతికి లాక్ డౌన్తో పెద్ద రిలీఫ్ దొరికినట్టయింది. ఇక వైద్య పరంగానూ దీర్ఘకాలికంగా వేధిస్తోన్న హెచ్ఐవి వ్యాధి నివారణకు కరోనా అవకాశం కల్పించిందని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు,ఇది లైఫ్ టైమ్లో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశమని చెబుతున్నారు.
జీవిత కాలంలో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశం..
కరోనా వైరస్ లాగే ఎయిడ్స్కి కూడా మందు లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా లాక్ డౌన్లో ఎయిడ్స్ వైద్య పరీక్షలపై ఫోకస్ పెడితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఒకరకంగా ఇలాంటి అవకాశం 'జీవిత కాలంలో ఒకసారి మాత్రమే వస్తుంది' అని చెబుతున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఒక గేమ్ చేంజర్గా మారతుందనడంలో అతిశయోక్తి లేదంటున్నారు.
ఇప్పుడే ఎందుకు టెస్టులు..
కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 30కి పైగా దేశాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కాబట్టి ఈ పీరియడ్లో బయటి వ్యక్తులతో శృంగారంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఇదే సమయంలో ప్రతీ ఒక్కరికీ STI(Sexually Transmitted Infections) పరీక్షలు నిర్వహించి.. ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిని గుర్తించి ట్రీట్మెంట్ అందించగలిగితే హెచ్ఐవి లేదా ఎయిడ్స్ను నివారించవచ్చునని బ్రిటీష్ అసోసియేషన్ ఫర్ సెక్సువల్ హెల్త్&హెచ్ఐవి ప్రెసిడెంట్ డా.జాన్ మెక్ సొరెలీ అభిప్రాయపడ్డారు. హెచ్ఐవి లక్షణాలు ఉన్నా లేకపోయినా.. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆ పేషెంట్లను గుర్తించి ట్రీట్మెంట్ అందించాలన్నారు.
నిపుణులు ఏమంటున్నారు..
యూకెకి చెందిన సెక్సువల్ హెల్త్ సర్వీస్ సభ్యుడు జస్టిన్ హర్బటిల్ మాట్లాడుతూ.. ఒక సమూహం సమిష్టిగా కొత్త భాగస్వాములతో సెక్స్కు దూరంగా ఉన్న సుదీర్ఘ సందర్భం ఇంతకంటే మరొకటి ఉండదని అన్నారు. కాబట్టి ఎస్టీఐలు ఉన్నవారి నుంచి మరొకరికి అది వ్యాప్తి చెందకుండా ఉండటం ఇప్పుడే సాధ్యమని.. ఇలాంటి తరుణంలో ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేయడం ద్వారా దాన్ని అడ్డుకోవచ్చునని తెలిపారు. ఎయిడ్స్ లక్షణాలు బయటపడనివారిని కూడా టెస్టులు ద్వారా గుర్తించవచ్చునని చెప్పారు. ముఖ్యంగా ఎస్టీఐలు సోకేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నవారు లాక్ డౌన్ పీరియడ్లో టెస్టులు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Recommended Video
న్యూజిలాండ్లోనూ...
ఆక్లాండ్ యూనివర్సిటీకి చెందిన డా.పీటర్ సక్సటన్ మాట్లాడుతూ.. హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఇప్పుడు దాదాపుగా ఆగిపోయి ఉంటుందని.. ఇలాంటి తరుణంలో పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలు చేయడం మంచి ఫలితాలనిస్తుందని అన్నారు. న్యూజిలాండ్లో దాదాపు 700 మంది హెచ్ఐవి అనిర్దారిత వ్యక్తులను గుర్తించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాళ్లందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సరైన చికిత్స అందిస్తే.. వారి ద్వారా ఇతరులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని చెప్పారు. ఇది జీవితకాలంలో ఒకసారి మాత్రమే వచ్చే అవకాశమని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటే హెచ్ఐవి కేసులను తగ్గించవచ్చునని అన్నారు.