కరోనాపై భయంకర నిజం వెలుగులోకి: వాటిపై 28 రోజుల పాటు తిష్ట: ఆదమరిస్తే..అంతే: సైన్స్ ఏజెన్సీ
క్యాన్బెర్రా: ప్రపంచాన్ని చుట్టేసిన ప్రాణాంతక కరోనా వైరస్పై అధ్యయనాలు కొనసాగుతోన్న కొద్దీ దానికి సంబంధించిన కొన్ని భయానక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. మనిషి శరీరంలోకి ఆ వైరస్ ప్రవేశించిన తరువాత.. దాని తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పటిదాకా మనకు తెలుసు. దాని బారిన పడిన ఓ మనిషి ప్రాణాలతో బయటపడాలంటే కనీసం రెండు వారాల సమయం పడుతుంది. అదే- కొన్ని రకాల వస్తువులు, కరెన్సీ నోట్లపై కరోనా తీవ్రత దాని కంటే రెట్టింపు రోజులు ఉంటుందని తాజాగా తేలింది.
Recommended Video
ఇక వైట్హౌస్ గడప దాటనున్న ట్రంప్: కరోనా మాయం: టెస్టింగ్ ఏంటో తెలుసా?: కంచుకోటలో తొలి ర్యాలీ
మనం రోజూ వాడే వస్తువులపై..
మన దినచర్యలో భాగమైనే కొన్ని రకాల వస్తువులపై కరోనా వైరస్ ప్రభావం 28 రోజుల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కరెన్సీ నోట్లు, సెల్ఫోన్ స్క్రీన్, స్టెయిన్లెస్ స్టీల్, వినీల్తో తయారు చేసిన వస్తువులపై కరోనా వైరస్ 28 రోజుల పాటు మనుగడ సాగించగలదని నిర్ధారించారు. ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ సైన్స్ ఏజెన్సీ ఈ విషయాన్ని నిర్ధారించింది. వైరాలజీ జర్నల్లో దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజెస్ ప్రిపేర్డ్నెస్ సారథ్యంలో చేపట్టిన పరిశోధనల్లో ఆ విషయం తేలిందని పేర్కొంది.
కాటన్ కంటే.. వాటిపైనే
కాటన్ వంటి ఎత్తుపల్లాలు ఉన్న పరికరాలు, వస్తువులపై కంటే కూడా సెల్ఫోన్ స్క్రీన్లు, వాటి కోసం వినియోగించే అద్దాలు, స్టెయిన్లెస్ స్టీల్, వినీల్ వంటి ఉపరితలం ఉన్న వాటిపైనే కరోనా వైరస్ ఎక్కువ కాలం పాటు మనుగడ సాగిస్తుందని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ల్యారీ మార్షల్ వెల్లడించారు. కరెన్సీ నోట్లు, ప్లాస్టిక్ కరెన్సీపైనా ఈ వైరస్ 28 రోజుల పాటు తిష్ట వేసి ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని పేర్కొన్నారు.
20 డిగ్రీల ఉష్ణోగ్రతలో మరింత..
20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న చోట కరోనా వైరస్ మరింత బలోపేతమౌతుందని, దృఢత్వాన్ని సాధిస్తుందని ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజెస్ ప్రిపేర్డ్నెస్ డిప్యూటీ డైరెక్టర్ డెబ్బీ ఈగిల్స్ తెలిపారు. నునుపుగా ఉండే ఉపరితల వస్తువులు, పరికరాలపై 28 రోజుల పాటు దాని ప్రభావం ఉంటుందని, ఈ విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తలెత్తిందని చెప్పారు. దీని బారి నుంచి కాపాడుకోవడానికి తరచూ చేతులను శుభ్రపరచుకోవడం, ముఖానికి మాస్క్లను ధరించడం వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోక తప్పదని అన్నారు.
30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో..
కరోనా వైరస్ తిష్ట వేసిన కరెన్సీ నోటును గానీ లేదా స్మార్ట్ఫోన్ స్క్రీన్ను గానీ 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ఉంచి చూస్తే.. దాని మనుగడ 17 రోజుల వరకు ఉంటుందని డెబ్బీ ఈగిల్స్ పేర్కొన్నారు. ఉష్ణోగ్రత తగ్గుతున్న కొద్దీ వైరస్ మనుగడ కాలం పెరుగుతుందని నిర్ధారించామని తెలిపారు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో 28 రోజులపాటు జీవించే కరోనా వైరస్.. 30 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో 17 రోజుల పాటు ఉండగలుగుతుందని చెప్పారు. కరోనా పరిమాణం, అది తిష్టవేసిన ఉపరితలం, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మార్పులు ఉంటాయని ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజెస్ ప్రిపేర్డ్నెస్ ప్రొఫఎసర్ ట్రెవర్ డ్రూ చెప్పారు.