Coronavirus:చైనాలో పాక్ విద్యార్థుల రోదన..భారత్ను చూసి బుద్ధి తెచ్చుకోండంటూ ఇమ్రాన్ఖాన్ పై ఫైర్
వూహాన్ / చైనా: కరోనా వైరస్ ధాటికి చైనాలో ఉన్న భారతీయ విద్యార్థులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలిస్తుండగా అక్కడే చిక్కుకుపోయిన పాకిస్తాన్ విద్యార్థులు రోధించారు. తమను కూడా పాకిస్తాన్కు పంపాలంటూ అర్థిస్తున్నారు. అంతేకాదు వారిని కాపాడటంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చైనాలో రోదిస్తున్న పాక్ విద్యార్థులు
కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. దీంతో అక్కడ చిక్కుకున్న ఇతర దేశస్తులను ఆయా ప్రభుత్వాలు తిరిగి వారి దేశంకు తరలిస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రోజున భారతీయ విద్యార్థులను మన ప్రభుత్వం ప్రత్యేక విమానంలో భారత్కు చేర్చింది. మొత్తం 324 మంది విద్యార్థులు శనివారం రోజున వూహాన్ నగరం నుంచి న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఆదివారం రోజున కూడా మరికొంత మంది విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎయిరిండియా విమానంను చైనాకు పంపించింది. ఇదిలా ఉంటే పాక్ ప్రభుత్వం మాత్రం తమ విద్యార్థులను తీసుకొచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అక్కడ చిక్కుకున్న పాకిస్తాన్ విద్యార్థుల రోదనలు మిన్నంటాయి. తమను కాపాడాల్సిందిగా కోరుతూ బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు.
భారత్ను చూసి నేర్చుకోండి
చైనాకు పాకిస్తాన్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. కరోనా వైరస్ బారిన పడి బిక్కు బిక్కు మంటున్న విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తూ పాకిస్తాన్ ప్రభుత్వంపై మండిపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వూహాన్ నుంచి భారతీయ విద్యార్థులను ఓ బస్సు తీసుకెళుతున్న వీడియోను పోస్టు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రశంసలు కురిపించారు. మీరు చనిపోయినా ఫర్వాలేదు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయం చేయలేదు అని చెబుతున్న పాక్ ప్రభుత్వంపై విద్యార్థులు విమర్శలు గుప్పించారు. భారత ప్రభుత్వం నుంచి మంచి అంటే ఏంటో నేర్చుకోండంటూ విద్యార్థులు హితబోధ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆహారం దొరక్క బాధపడుతున్నా చలించరా..?
మరో వీడియోలో మాస్క్ ధరించిన పాకిస్తాన్ యువతి తమను కాపాడాల్సిందిగా కోరుతూ ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్లో కూడా పరిస్థితి బాగోలేనందున తమ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారని .. తామేమో తిండి దొరక్క వూహాన్ నగరంలో చిక్కుకుపోయామని వీడియోలో ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్తో అక్కడ అన్ని దుకాణాలు మూసివేశారని కొద్దిరోజులుగా ఆహారం కూడా దొరకడం లేదని యువతి రోధించింది. మహ్మద్ రౌఫ్ అనే 30 ఏళ్ల విద్యార్థి తన బాధను పంచుకున్నాడు. రోజుకు నాలుగు గంటలు మాత్రమే బయటకు వస్తున్నామని చెప్పిన రౌఫ్ మిగతా రోజంతా తాము తమ గదులకే పరిమితం అవుతున్నట్లు చెప్పాడు. ఇక ప్రాణాల కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నట్లు వివరించాడు. అన్ని దేశ ప్రభుత్వాలు తమ విద్యార్థులను తమ దేశాలకు తరలిస్తుంటే.. పాకిస్తాన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని చెప్పాడు.
ఏది ఏమైనా సరే విద్యార్థులను తరలించేది లేదన్న పాక్
ఇదిలా ఉంటే పాకిస్తాన్ విద్యార్థులు చైనాలో ఉండటమే మంచిదని రెండు దేశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని అక్కడి నుంచి తరలించడం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ జాఫర్ మీర్జా చెప్పారు. ఇదిలా ఉంటే చైనాలో ఉంటున్న పాక్ విద్యార్థులు నలుగురికి కరోనా వైరస్ సోకిందని నిర్థారించారు. వూహాన్ నగరం నుంచి తమ విద్యార్థులను పాక్కు తీసుకురావడం లేదంటే... దానర్థం వారి గురించి పట్టించుకోవడం లేదనటం సరికాదన్నారు.