చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి: కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉంది: పరిశోధకుల హెచ్చరిక
హూస్టన్: వాతావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు పడిపోతే అలాంటి చోట్ల వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని నిర్ధారించేందుకు వైరస్తో పోలిన కొన్ని పదార్థాలను తీసుకుని వాతావరణం వాటిపై ఏమేరకు ప్రభావం చూపుతుందో పరీక్షించారు. ఈ పరీక్షల ద్వారా కరోనావైరస్ కూడా చల్లటి ప్రాంతాలు లేదా ప్రదేశాల్లో ఎక్కువ కాలం జీవించి ఉంటుందని తేల్చి చెప్పారు.
వైరస్లాంటి పదార్థాలపై స్టడీ
బైయోకెమికల్, బైయో ఫిజికల్ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో ప్రచురితమైన స్టడీ ప్రకారం... కోవిడ్ వైరస్తో పోలిఉన్న పదార్థాలను పరీక్షించినట్లు పేర్కొనడం జరిగింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఉతాహ పరిశోధకులు ఈ పరిశోధనలను చేపట్టారు. ముందుగా వైరస్తో పోలిన పదార్థాలను తీసుకున్నారు. కరోనావైరస్లో ఎలాగైతే మూడు రకాల ప్రొటీన్లు ఉంటాయో ఇందులో కూడా ఆ ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఇందులో ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేసే జెనటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ లేదని వెల్లడించింది.
పొడి-తడి వాతావరణంలో పరిశోధనలు
ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేపట్టిన పరీక్షల్లో వైరస్ లాంటి పదార్థాలను గాజు పరిసరాలపై ఉంచారు. దీన్ని పొడి వాతావరణంలో మరియు తేమతో కూడిన వాతావరణంలో పరీక్షించారు. కరోనావైరస్ సోకిన వ్యక్తి ఇతరులకు వైరస్ను తమలోని సూక్ష్మ బిందువుల ద్వారా వ్యాపింపచేస్తున్నారని శాస్త్రవేత్తలు వివరించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బయటకు విడుదలయ్యే సూక్ష్మ బిందువులు మరొక వ్యక్తి పైన పడితే వైరస్ సోకుతుందని చెప్పారు. ఇలా బయటపడిన సూక్ష్మ బిందువులు తడిగాను లేదా పొడిగాను ఉంటాయని ఇవి నేరుగా మరో కొత్త వ్యక్తిలోకి ప్రవేశించి వైరస్ను వ్యాపింపచేస్తాయని వివరించారు. చాలా అడ్వాన్స్డ్ మైక్రోస్కోపీ టెక్నిక్స్ ద్వారా పరిశోధకులు ఈ వైరస్ లాంటి పదార్థాలు ఎలా మార్పు చెందుతున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వైరస్లాంటి పదార్థాలను రెండు ఉష్ణోగ్రతల వద్ద ఉంచి పరీక్షించారు. ద్రావణ మిశ్రమం, పొడి వాతావరణంలో ఉంచి పరీక్షించారు.
గదిలో, చల్లని వాతావరణంలో...
తడి మరియు పొడి వాతావరణంలో ఈ వైరస్ లాంటి పదార్థాలను 93 ఫారెన్హీట్ ఉష్ణోగ్రతల వద్ద దాదాపు 30 నిమిషాల పాటు ఉంచడంతో వైరస్ యొక్క బాహ్య నిర్మాణం చెడిపోయి ఉండటాన్ని తాము గమనించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే గదిలోని వాతావరణం, బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువ కాలం జీవించి ఇన్ఫెక్షన్ వ్యాపింపజేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే తేమ ప్రదేశాల్లో కరోనావైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గిన అతను లేదా ఆమె నుంచి విడుదలైన సూక్ష్మ బిందువులు ఏమేరకు గాలిలో ప్రయాణం చేశాయన్నదానిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఆ పదార్థాలు పొడిబారక ముందు ఎంత దూరం ప్రయాణించాయో అక్కడ వైరస్ వ్యాప్తి ఉంటుందని చెప్పారు.
చివరకు ఏం తేల్చారు..
వైరస్ను చంపేందుకు ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు అవసరమో శాస్త్రవేత్తలు పరిశోధించారు. అయితే పరిస్థితులు వెచ్చగా ఉంటే చాలనే నిర్ధారణకు వచ్చారు. ఈ వైరస్ ఉష్ణోగ్రతలకు చాలా సెన్సిటివ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పదార్థాలు ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేయాలంటే... కోవిడ్లోని కొన్ని ప్రొటీన్లు ఓ క్రమపద్దతిలో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ వైరస్ పదార్థాలు ఎక్కడెక్కడో ఒక క్రమపద్ధతి లేకుండా పడితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, అయితే ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్ది అంటే చలికాలంలో మాత్రం ఈ పదార్థాలు ఎక్కువ సేపు జీవించి ఉంటాయి కనుక ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలున్నాయని వెల్లడించారు.