ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ మరో దారుణం : కరోనా వైరస్ పేషెంట్ కాల్చివేత..
కరోనా వైరస్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తుందో తెలిసిందే. ఓవైపు పిట్టల్లా జనం రాలిపోతుంటే.. దాన్నెలా నియంత్రించాలో తెలియక చైనా సతమతమవుతోంది. అదే సమయంలో ఇతర దేశాలకు కూడా వైరస్ పాకడంతో.. దాని నియంత్రణకు ఆయా దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి. మిగతా దేశాల సంగతేమో గానీ.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఈ విషయంలో తన నియంతృత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. కరోనా సోకిన పేషెంట్ను ఏకంగా హత్య చేయించి మరోసారి వార్తల్లో నిలిచాడు. దక్షిణ కొరియాకు చెందని డాంగ్- ఆ ఇల్బో అనే వార్తాపత్రిక ఈ సంచలన కథనాన్ని ప్రచురించింది.
Coronavirus : కరోనా ముప్పు పొంచివున్న దేశాల జాబితాలో భారత్ ఏ స్థానంలో ఉందంటే..
ఐసోలేషన్ క్యాంపుల్లో..
ఆ పత్రిక కథనం ప్రకారం.. ఇటీవల చైనా నుంచి తిరిగొచ్చిన ఓ ప్రభుత్వ అధికారిని.. కరోనా సోకిందన్న అనుమానంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు. నిజానికి ఇప్పటివరకు ఉత్తరకొరియాలో కరోనా కేసులేవీ నిర్దారణ కానప్పటికీ.. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా సైనిక చట్టాలను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చైనా వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరిని ఐసోలేషన్ క్యాంపులకు తరలిస్తున్నారు.
కరోనా పేషెంట్ను కాల్చి చంపేశారు..
కరోనా ఐసోలేషన్ క్యాంపుకు తరలించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అనుమతి లేకుండా బయటకు వచ్చాడన్న కారణంగా అధ్యక్షుడి ఆదేశాల మేరకు అధికారులు అతన్ని కాల్చి చంపారు. ఉత్తరకొరియాలో అధ్యక్షుడి ఆదేశాలను తిరస్కరించడం ఎంత అసాధ్యమో అందరికీ తెలిసిందే. అధ్యక్షుడు జారీ చేసే ఏ ఆదేశాలను పాటించకపోయినా.. అక్కడ విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. అందుకే అక్కడ మరణశిక్షలు అతి సాధారణమన్న వాదన వినిపిస్తుంది. అయితే అధికారికంగా దీనిపై ఎటువంటి ధ్రువీకరణలు లేవు.
మరో 30 రోజులు నిర్భంధమే..
కరోనా అనుమానిత పేషెంట్లను మరో 30 రోజులు ఐసోలేషన్ క్యాంపుల్లోనే పెట్టాలని ఉత్తరకొరియా నిర్ణయించింది. కాగా,ఉత్తరకొరియాలో ఇప్పటివరకు కరోనా కేసులేవీ నమోదు కాలేదని ఆ దేశం చెబుతుండగా.. అది అబద్దమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఆ దేశంలో పలువురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారన్న కథనాలు వస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఉత్తర కొరియాలో కరోనా కారణంగా మరణాలు సంభవించినట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది.
Recommended Video
పెరుగుతున్న మృతుల సంఖ్య
అటు చైనాను కరోనా కబళిస్తూనే ఉంది.అక్కడ కరోనా మృతుల సంఖ్య 1367కి చేరింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 254 మంది కరోనాతో మృతి చెందారు. దాదాపు 60,363 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 28 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. చైనాలో వుహాన్ పట్టణంలో ఉన్న సీ ఫుడ్ మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్న ప్రచారం ఉంది. ఇప్పటికైతే దీనిపై కచ్చితమై నిర్దారణ ఏది జరగలేదు. ఇక కరోనా వైరస్కు డబ్ల్యూహెచ్ఓ కోవిడ్-19 అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.