రాచకుటుంబాన్నీ వదలని కరోనా.. ప్రిన్స్ చార్లెస్కు పాజిటివ్.. బ్రిటన్లో భయానక ఒత్తిడి..
విపత్తులకు రాజు-పేద తేడాలుండవన్న నానుడి మరోసారి రూఢీ అయింది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెద్దకొడుకు, వేల్స్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెన్స్(71) కరోనా కాటుకు గురయ్యారు. మూడు రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ఆయన భార్య కెమిల్లా(72)కు మాత్రం నెగటివ్ రిపోర్టులొచ్చాయి. ప్రస్తుతం ఆ ఇద్దరూ స్కాట్లాండ్ లోని తమ ప్యాలెస్ లో చెరో గదిలో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
నమస్తే ప్రయత్నించినా..
యూరప్ లో కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి ప్రిన్స్ చార్లెస్ షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేశారు. పలు అధికారిక కార్యక్రమాల్లో ఆయన ఇండియన్ స్టైల్ ‘నమస్తే' చెబుతూ అందర్నీ పలకరించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దురదృష్టవశాత్తూ ఆ జాగ్రత్త ఆయనను కాపాడలేకపోయింది. మార్చి 12న చార్లెస్ ను కలిసిన మొనాకో యువరాజు ఆల్బర్ట్ కు కూడా టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. అంతకు మూడ్రోజుల ముందు..
కుటుంబానికి సోకిందా?
చార్లెస్ తన తల్లి క్వీన్ ఎలిజబెత్, కొడుకులు ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హ్యారీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్లెస్ పాజిటివ్ గా తేలడంతో కుటుంబమంతటికీ వైరస్ సోకి ఉంటుందా అనే భయాలు వ్యాపించాయి. అంతలోనే క్వీన్ ఎలిజబెత్ తాను విండ్సర్ కోటలో సేఫ్ గా ఉన్నానని, కరోనా కష్టకాలంలో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే..
ఒత్తిడిలో వైద్య సిబ్బంది..
బ్రిటన్ లో కరోనా విలయం వైద్య సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. వైరస్ కారణంగా బుధవారం నాటికి 422 మంది చనిపోగా, పాజిటివ్ కేసుల సంఖ్య 8077కు పెరిగింది. ఆస్పత్రులు ఉన్నా, అవసరానికి సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. లండన్ లో పనిచేస్తోన్న నేషనల్ హెల్త్ సర్వీసుకు చెందిన ఓ యువ నర్సు పని ఒత్తిడి భరించలేక డ్యూటీలో ఉండగానే ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలిచివేసింది. అయినాకూడా..
Recommended Video
జనం దారి వాళ్లదే..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి బ్రిటన్ లాక్ డౌన్ ప్రకటించారు. కానీ ప్రజలెవరూ ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయడంలేదు. ఇష్టారీతిగా రోడ్లపై తిరుగుతున్నవాళ్లను పోలీసులు అతి కష్టంమీద ఇళ్లకు పంపుతున్నారు. వైద్య సిబ్బంది కొరత వేధిస్తుండటంతో.. ప్రభుత్వం 2.5 లక్షల మంది వాలంటీర్ల కోసం పిలుపునివ్వగా, 1.7 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. రిటైరైన ఉద్యోగుల సేవలనూ వాడుకోవాలని బోరిస్ సర్కారు నిర్ణయించింది.