కుప్పకూలిన కరోనా క్వారంటైన్ భవనం: 10 మంది మృతి
బీజింగ్: చైనాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, కరోనా అనుమానితుల్ని వైద్య పర్యవేక్షణలో ఉంచిన క్వారంటైన్ హోటల్ భవనం కుప్పకూలడంతో పది మంది మృతి చెందారు.
మరో 24 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో సుమారు 70 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. క్వాన్ జై నగరంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మొత్తం 43 మందిని కాపాడామని, 36 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది మొత్తం కలిపి వెయ్యి మంది వరకు సహాయక చర్యలు పాల్గొన్నారు.
బాధితులంతా కరోనా అనుమానితులు కావడంతో సహాయ సిబ్బంది టోపీలు, మాస్కులు, కళ్లజోడు లాంటివి ధరించి సహాయక చర్యలు చేపట్టారు. క్వారంటైన్ భవనంలో ప్రమాద సమయంలో 58 మంది కరోనా అనుమానితులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
Recommended Video
కాగా, కరోనావైరస్ బారిన పడి ఇప్పటికే చైనాలో 3వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 50వేల మందికిపైగా కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలో తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్న కరోనావైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా కాకుండా ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో 200 మందికిపైగా, అమెరికాలో 50 మందికిపైగా కరోనాతో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.