సౌదీ అరేబియా అసాధారణ నిర్ణయం.. మక్కా, మదీనా యాత్రలపై నిషేధం.. వీసాల జారీ నిలిపివేత
ఇంకొద్ది రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ముస్లింల ఆథ్యాత్మిక కేంద్రాలైన మక్కా, మదీనా యాత్రలపై సౌదీ అరేబియా సర్కారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో కోవిడ్ 19(కరోనా వైరస్) విజృభిస్తున్న నేపథ్యంలో.. కరోనా ప్రభావిత దేశాల వారికి మక్కా, మదీనాలో ప్రవేశం కల్పించబోమంటూ గురువారం సంచలన ప్రకటన చేసింది. వీసాల జారీని కూడా నిలిపేస్తున్నట్లు తెలిపింది.
Recommended Video
ఆసియా అంతటా కరోనా ప్రబలుతుండటం, ఇరాన్ లో వారం వ్యవధిలోనే 26 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలకూ వైరస్ విస్తరించిన నేపథ్యంలో ఆ ప్రభావం మక్కా, మదీనా యాత్రలపై పడొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అధికారులు చెప్పారు. అయితే ఏయే దేశాల యాత్రికుల్ని నిషేధిస్తున్నారనే లిస్టును మాత్రం సౌదీ విడుదల చేయలేదు.
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కాకు కేవలం హజ్ సమయంలోనే కాకుండా, ఏడాది పొడవునా లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఈ మేరకు వీసాల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే గురువారం నాటి ప్రకటనతో వీసాల జారీ ప్రక్రియపై దాదాపు నిలిచిపోయింది. ఫలానా దేశాలంటూ పేర్లు చెప్పకుండానే వీసాల జారీని నిలిపేశామని అధికారులు చెప్పడం గమనార్హం.
తూర్పు ఆసియాలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న కొవిడ్ 19(కరోనా వైరస్) ఇప్పుడు మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా దేశాలకూ విస్తరించింది. పాకిస్తాన్ లో రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈమధ్యే ఇరాన్ నుంచి తిరిగొచ్చిన 8వేల మందికి టెస్టులు నిర్వహించాలని ఇమ్రాన్ సర్కారు నిర్ణయించింది. అటు ఇరాన్ లో కరోనా మృతుల సంఖ్య 26కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడి చనిపోయినవాళ్ల సంఖ్య 3వేలకు దగ్గరగా ఉంది.