పరిస్థితి మరింత దిగజారింది.. కరోనాపై బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 70లక్షలు దాటడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయని అభిప్రాయపడింది. అమెరికాలో కొత్తగా వ్యాప్తి చెందుతోన్న కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతాన్ని నిరసిస్తూ ఆందోళనలు పెల్లుబికిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.
Recommended Video
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్..
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ.. ప్రపంచానికి ఇప్పుడు అతిపెద్ద ముప్పు నిర్లక్ష్యమేనని పేర్కొన్నారు. కరోనాతో దాదాపు ఆర్నెళ్లుగా ప్రపంచం పోరాటం సాగిస్తోందని.. ఇలాంటి తరుణంలో ఏ ఒక్క దేశం పోరాటం నుంచి తప్పుకోవద్దని,నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు. యూరోప్లో పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ కనిపిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మరింత దిగజారిందని అన్నారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. డబ్ల్యూహెచ్ఓ సమానత్వాన్ని పూర్తిగా సమర్థిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జాత్యహంకార వ్యతిరేక పోరాటానికి మద్దతు పలుకుతుందన్నారు. ఏ రకమైన వివక్షనైనా డబ్ల్యూహెచ్ఓ తిరస్కరిస్తుందన్నారు
ఆందోళనల్లో పాల్గొంటున్నవారికి సూచనలు..
అమెరికాలో ఆందోళనల్లో పాల్గొంటున్నవారు.. వీలైనంత మేరకు మనిషికి,మనిషికి మధ్య ఒక మీటర్ దూరం పాటించాలన్నారు. అలాగే చేతులను శుభ్రంగా కడుక్కోవాలని,దగ్గినప్పుడు,తుమ్మినప్పుడు మోచేతులు అడ్డు పెట్టుకోవాలని సూచించారు. అలాగే నిరసనల్లో పాల్గొంటున్నప్పుడు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఒకవేళ అనారోగ్యం బారిన పడితే ఇంటి వద్దే ఉండాలని.. హెల్త్ కేర్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
ఇప్పటివరకూ ఐదు మిలియన్ల కిట్లు..
వైరస్ సోకిన వ్యక్తి క్లోజ్ కాంటాక్ట్స్ను గుర్తించి క్వారెంటైన్ చేయడం చాలా ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ మరోసారి స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైఖెల్ ర్యాన్ మాట్లాడుతూ.. భారీ సామూహిక నిరసనల్లో పాల్గొంటున్న వ్యక్తులకు కరోనా కాంటాక్ట్స్ విషయంలో టెక్నికల్ డెఫినిషన్ సరిపోదన్నారు. అనారోగ్యంతో ఉన్న ఎవరైనా సరే.. ఎలాంటి సామూహిక సమావేశాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితం కావాలని చెప్పారు. ఇప్పటివరకూ డబ్ల్యూహెచ్ఓ 110 దేశాలకు ఐదు మిలియన్లకు పైగా పీపీఈ కిట్లను సప్లై చేసిందని టెడ్రోస్ తెలిపారు. వాస్తవానికి 126 దేశాలకు 129 మిలియన్లకు పైగా పీపీఈ కిట్లను రవాణా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.