కరోనా ఎఫెక్ట్ : ఆస్ట్రేలియాలో 'టాయిలెట్ పేపర్' వెర్రి.. పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే..
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించడమే కాదు ప్రజలను వెర్రివాళ్లను కూడా చేస్తోంది. ఏది నిజమో.. ఏది అబద్దమో అన్న ఆలోచన కూడా లేకుండా ఏ ప్రచారం జరిగినా నమ్మేస్తున్నారు. అనవసర అపోహలు,భయాలు సృష్టించుకుని కంగారెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్లు కరోనా విషయంలో కాస్త అతి చేస్తున్నారనే చెప్పవచ్చు. ఆఖరికి టాయిలెట్ పేపర్ కొనుగోలుపై కూడా రిటైల్ మార్కెట్లలో ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి తలెత్తిందంటే అక్కడి ప్రజలు ఎంతగా వెర్రిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది..
ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళన మొదలైంది. చాలామంది ప్రజలు సూపర్ మార్కెట్ల నుంచి ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో.. వచ్చినా ఇంటికి కావాల్సిన వస్తువులు దొరుకుతాయో దొరకవో అన్న ఆందోళనతో ఇళ్లల్లో కిరాణా వస్తువులను భారీగా నిల్వ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో టాయిలెట్ పేపర్ను కూడా కొన్ని నెలలకు సరిపడా ముందే కొనేస్తున్నారు. సిడ్నీలోని పలు సూపర్ మార్కెట్లలో కస్టమర్లు తమ ట్రాలీల్లో గుట్టగుట్టలుగా టాయిలెట్ పేపర్ కట్టలను నింపుతూ కనిపిస్తున్నారు. ఇదంతా అనవసరమని.. ప్రజలు లేనిపోని అపోహలకు గురై ఆందోళన చెందవద్దని అక్కడి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రజలు మాత్రం లెక్క చేయడం లేదు.
పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..
సూపర్ మార్కెట్లలో అలా టాయిలెట్ పేపర్ కట్టలను పెట్టడమే ఆలస్యం.. క్షణాల్లో ఖాళీ అయిపోతున్నాయి. జనం అంతలా టాయిలెట్ పేపర్ల కోసం ఎగబడుతున్నారు. జనాల అతిని తట్టుకోలేక.. కొన్ని రిటైల్ మార్కెట్లు.. ఒక్కొక్కరు కేవలం 3 లేదా 4 టాయిలెట్ పేపర్ కట్టలను మాత్రమే తీసుకెళ్లాలని ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. బుధవారం సిడ్నీలోని ఓ సూపర్మార్కెట్లో ఓ కస్టమర్ ఏకంగా కత్తి తీసి బెదిరించాడు. దీంతో పోలీసులను పిలిపిస్తే గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
సోషల్ ట్రెండింగ్లో టాయిలెట్ పేపర్
ఆస్ట్రేలియాలో #toiletpapergate, #toiletpapercrisis అనే హాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ అవుతున్నాయి. మరీ దారుణం ఏంటంటే.. రేడియో స్టేషన్ నిర్వాహకులు కూడా గిఫ్ట్ కింద శ్రోతలకు టాయిలెట్ పేపర్ కట్టలు ఇస్తున్నారు. ఆఖరికి పబ్లిక్ టాయిలెట్స్లో ఉండే టాయిలెట్ పేపర్ను కూడా ఎత్తుకెళ్తున్నారు. ఆస్ట్రేలియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.బ్రెండన్ మర్ఫీ దీనిపై మాట్లాడుతూ.. సూపర్ మార్కెట్లలో టాయిలెట్ పేపర్ కాగితాన్ని లేకుండా చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్ణయం కాదని అన్నారు. అటు టాయిలెట్ పేపర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు దీనిపై మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న డిమాండ్ మేరకు అవసరమైన సప్లై చేయడానికి 24గంటలు ప్రొడక్షన్ చేస్తున్నామని తెలిపారు.
Recommended Video
ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు..
ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు.. ఇలాంటి పరిస్థితే హాంకాంగ్,జపాన్లలోనూ నెలకొంది. టాయిలెట్ పేపర్ కొరత ఏర్పడిందన్న వదంతులతో గత నెలలో హాంకాంగ్లోని ఓ సూపర్ మార్కెట్లో కొంతమంది దోపిడీ దొంగలు టాయిలెట్ పేపర్ కట్టలను ఎత్తుకెళ్లారు. కరోనా వైరస్ కారణంగా తలెత్తిన అపోహలతో.. ప్రజలంతా ఎగబడి కిరాణా వస్తువులను కొనుగోలు చేస్తుండటంతో.. టాయిలెట్ పేపర్ కొరత ఏర్పడిందన్న వదంతులు పుట్టుకొచ్చాయి. ఆస్ట్రేలియాలో నెలకొన్న పరిస్థితిపై సోషల్ మీడియాలో విపరీతమైన జోక్స్ పేలుతున్నాయి. బతకడానికి జీవితంలో అన్నింటికంటే టాయిలెట్ పేపరే ముఖ్యమవుతుందని ఏనాడు ఊహించలేదని కొంతమంది నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.