తగ్గిన దూకుడు... అయినా గంభీర ప్రకటనలు... యాప్స్ నిషేధంపై చైనా లేటెస్ట్ రియాక్షన్...
చైనీస్ యాప్స్పై భారత్ నిషేధం విధించడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్ ధోరణి సరిగా లేదని... ఇది సరైన పద్దతి కాదని చైనా తాజాగా వ్యాఖ్యానించింది. ఇది ఉద్దేశపూర్వక చర్య లాగే కనిపిస్తోందని.. చైనా వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. తాజాగా భారత్ మరో 47 చైనీస్ యాప్స్పై నిషేధం విధించిన నేపథ్యంలో చైనా ఇలా స్పందించింది. యాప్స్పై నిషేధం విషయంలో భారత్ పట్ల చైనా దూకుడు మంత్రాన్ని పక్కనపెట్టినప్పటికీ గంభీర ప్రకటనలకు మాత్రం తెరపడట్లేదు.
తప్పుల్ని సరిదిద్దుకోవాలని హితవు...
చైనీస్ ఎంబసీ ప్రతినిధి,కౌన్సిలర్ జి రోంగ్ మాట్లాడుతూ... 'జూన్ 29న భారత్ చైనాకు చెందిన 59 యాప్స్ను నిషేధించింది. ఇందులో వి చాట్ కూడా ఉంది. భారత్ చర్య చైనా కంపెనీల చట్టబద్దమైన హక్కులను,వ్యాపార ప్రయోజనాలను కాలరాసేలా ఉన్నది. భారత్ ఈ తప్పులను సరిదిద్దుకోవాలని చైనా కోరింది.' అని తెలిపారు. ఓవైపు భారత్ చైనాకు చెందిన మరో 47 యాప్స్పై నిషేధానికి సంబంధించిన ప్రక్రియలో తలమునకలై ఉండగా... మరోవైపు న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అంతర్జాతీయ నియమాలు,నైతిక పద్దతుల గురించి మాట్లాడుతుండటం గమనార్హం.
ఆ బాధ్యత భారత్పై ఉందని...
'ఒక విషయాన్ని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. విదేశీ కార్యకలాపాలకు సంబంధించి చైనీస్ కంపెనీలు అంతర్జాతీయ నియమాలు,స్థానిక చట్టాలు,నిబంధనలకు లోబడి ఉండాలని చైనా ప్రభుత్వం పదేపదే మాకు చెబుతుంది. చైనీస్ కంపెనీలతో సహా భారత్లో పెట్టుబడులు పెట్టిన ఇతర విదేశీ కంపెనీల చట్టబద్దమైన హక్కులను,ప్రయోజనాలను మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా పరిరక్షించాల్సిన బాధ్యత భారత్పై ఉంది.' అని జి రోంగ్ పేర్కొన్నారు.
అన్ని చర్యలు తీసుకుంటామన్న చైనా..
భారత్ చర్యలను ఉద్దేశపూర్వకమైనవిగా పేర్కొన్న చైనా... తమ కంపెనీలపై ఇటువంటి ఆర్థిక ఆంక్షలు భారత ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడవని పేర్కొంది. చైనా కంపెనీలను రక్షించడానికి బీజింగ్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. భారత్-చైనా మధ్య సహాయ సహకారాలు ఇరు దేశాలకు మేలు చేస్తాయని.. అలా కాకుండా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్లడం సరికాదని వ్యాఖ్యానించింది.
Recommended Video
259 యాప్స్... జాబితా సిద్దం...
మొదట టిక్టాక్,హాలో,షేర్ ఇట్ సహా 59 చైనీస్ యాప్స్పై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీటికి క్లోన్గా ఉన్న మరో 47 యాప్స్పై తాజాగా నిషేధాన్ని ప్రకటించింది. అయితే ఆ 47 యాప్స్ ఏంటన్నది ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తులో భారత్ ఉన్నది. మొత్తంగా 259 చైనీస్ యాప్స్తో కూడిన ఓ జాబితాను భారత్ ఇప్పటికే సిద్దం చేసింది. భారత్ జాతీయ భద్రత,యూజర్ ప్రైవసీకి సంబంధించి ఈ యాప్స్ పనితీరును ప్రభుత్వం పరిశీలించనుంది.