మసూద్ అజహర్ను బ్లాక్ లిస్టులో పెట్టండి : అమెరికా
పాక్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్, చైనాలకు ఎదురుదెబ్బ తగిలింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రయత్నంలో మరో అడుగు ముందుకు పడింది. అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా.. తన వీటో అధికారంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అంతరిక్షంలో ఉపగ్రహం కూల్చివేత ప్రయోగంపై పాక్ స్పందన..ఏమి చెప్పిందంటే..?
సభ్యదేశాలకు తీర్మానం కాపీ
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు సహకరించాలని అమెరికా భద్రతా మండలిలోని 15 సభ్యదేశాలను కోరింది. ఈ మేరకు బ్రిటన్, ఫ్రాన్స్ సంతకం చేసిన తీర్మానాన్ని ఆయా దేశాలకు అందజేసింది. అజర్పై ట్రావెల్ బ్యాన్ విధించాలని, అతని ఆస్తులను స్తంభింపజేయాలని కోరింది.
తీర్మానాన్ని అడ్డుకుంటున్న చైనా
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరిలోనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీకి ప్రతిపాదించాయి. అయితే ఇందులోని కొన్ని అంశాలను సాకుగా చూపుతూ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగుసార్లు అడ్డుకుంది. దీంతో ఈసారి కచ్చితంగా అజర్పై నిషేధం విధించేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
షరతులు విధిస్తున్న పాక్
ఇదిలా ఉంటే ఉగ్రవాదం విషయంలో పాక్ మరోసారి తన బుద్ధి బయటపెట్టుకుంది. మసూద్ అజర్ను కొన్ని షరతులపై అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి అంగీకరించాలని చైనాకు సూచించింది. భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గేలా భారత్ చర్యలు తీసుకోవడం, పాక్తో వెంటనే ద్వైపాక్షిక చర్చల్ని పునరుద్ధరించడం తదితర షరతులకు అంగీకరించాలని చెప్పింది. పాక్ షరతులను చైనా ఇప్పటికే అగ్రరాజ్యంతో పాటు భారత దౌత్యవేత్తలకు తెలిపింది. అయితే పాక్ చర్యలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి, భారత్ - పాక్ మధ్య చర్చలకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పింది.