భారత్కు మద్దతిచ్చే దేశాలపై క్షిపణి దాడులు చేస్తాం: పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఇస్లామాబాదు: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పై కడుపు చించుకుంటోంది పాకిస్తాన్. పలు అంతర్జాతీయ వేదికలపై భారత్ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్... ఆ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా మారారు. ఛాన్స్ దొరికితే భారత్పై విషం చిమ్మాలన్న పాకిస్తాన్ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు మిస్ ఫైర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా పాక్ మంత్రి అలీ అమీన్ గందాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారత్కు అండగా నిలిచే దేశాలపై పాక్ టార్గెట్
ఒకరు అణుయుద్ధం అంటారు.. మరొకరు భారత్ను ధ్వంసం చేస్తాం అని హెచ్చరిస్తారు.. తాజాగా మరొకరు భారత్కు మద్దతు ఇచ్చే దేశాలపై క్షిపణి దాడులు చేస్తాం అని అంటారు. ఇదీ పాకిస్తాన్ మంత్రుల వ్యవహరిస్తున్న తీరు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ భారత్పై విషం చిమ్మడం ప్రారంభించింది. అది ఇంకా పూర్తి కాలేదు. అవకాశం దొరికినప్పుడల్లా మైకు ముందు ఉంటే చాలు పాక్ మంత్రుల నోళ్లు అదుపు తప్పుతున్నాయి. తాజాగా భారత్కు అండగా నిలిచే దేశాలను విడిచిపెట్టడం లేదు పాక్ మంత్రులు. ఆ దేశాలపై క్షిపణి దాడులు చేస్తామని పాకిస్తాన్ మంత్రి అలీ అమీన్ గందాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారత్కు మద్దతు ఇస్తున్న దేశాలన్నీ పాకిస్తాన్కు శతృదేశాలే అని బహిరంగ వ్యాఖ్యలు చేశారు.
క్షిపణి దాడులు చేస్తామన్న పాక్ మంత్రి అలీ అమీన్
కశ్మీర్ విషయంలో పరిస్థితులు చేదాటి పోతే భారత్పై యుద్ధానికి దిగడం తప్ప పాకిస్తాన్కు మరో మార్గం లేదన్న పాక్ మంత్రి అలీ అమీన్.. ఆ సమయంలో భారత్కు అండగా నిలిచే దేశాలపై కూడా క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించారు. మంత్రి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలను పాక్ జర్నలిస్టు నైలా ఇనాయత్ ట్విటర్లో పోస్టు చేశారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ను తప్పుబడుతూ ప్రపంచదేశాలు భారత్కు అండగా నిలుస్తున్న నేపథ్యంలో మంత్రి అలీ అమీన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్తో అన్ని సంబంధాలు తెంచుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
యూఎన్ సమావేశాల్లో కూడా ఇమ్రాన్ది ఇదే తీరు
ఇక జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అంతర్గత విషయమని బయటి దేశాల జోక్యం అనవసరమని భారత్ ముందునుంచే చెప్పుకొంటూ వస్తోంది. ఇదే విషయాన్ని సార్క్ సమావేశాల్లో కూడా స్పష్టం చేసింది. ఇక గతనెల న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశాల్లో కూడా భారత్ ఇదే అంశాన్ని ప్రస్తావించింది. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మాత్రం భారత్పై అణుయుద్ధానికి దిగాల్సి వస్తుందనే సంకేతాలు ఇచ్చారు.