ఊపిరాడని అమెరికా: ఒక్కరోజే 1858 మంది మృతి: న్యూయార్క్ ఛిన్నాభిన్నం: శ్మశానాలుగా నగరాలు..
న్యూయార్క్: చైనాలో జన్మించిన కరోనా వైరస్.. అమెరికాపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. లక్షలాది మందిని ఆసుపత్రిపాలు చేసింది. రికార్డు స్థాయిలో మరణాలను నమోదు చేస్తోంది అగ్రరాజ్యం. అమెరికాలోని ప్రధాన నగరాలన్నీ శ్మశానాలుగా మారుతున్నాయి. కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని చవి చూస్తున్నాయి. కరోనా వైరస్ సృష్టించే విలయం ఎలాంటిదో ఇప్పటికే చవి చూసిన స్పెయిన్, ఇటలీలను మించిన దుష్ప్రభావం అమెరికాపై పడింది.
ఒక్కరోజ 1858 మంది మృతి..
అమెరికాలో ఒక్కరోజే 1858 మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఇది హయ్యెస్ట్. కరోనా మరణాల సంఖ్యలో అమెరికా తన రికార్డును తానే బ్రేక్ చేసుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమెరికాలో ఒక్కరోజులో వెయ్యిమందికి పైగా మరణించిన సందర్భాలు రెండుసార్లు సంభవించాయి. ఈ రెండు రికార్డులను అధిగమించేలా.. 1858 మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో మరణాలు నమోదు కాలేదు.
న్యూయార్క్లో అయిదు వేలకు పైగా
కరోనా వైరస్ బారిన పడి అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్ నగరం ఛిన్నాభిన్నమైంది. ఒక్క న్యూయార్క్లోనే 5489 మంది మరణించారు. ఈ స్థాయిలో భారత్లో పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదంటే.. అక్కడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్లో 1,42, 384 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా మరణాల సంఖ్య 10 మార్క్ను దాటవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
మిగిలిన నగరాల్లోనూ అదే దుస్థితి..
ఇలాంటి భయానక వాతావరణం న్యూయార్క్కే పరిమితం కాలేదు. దాదాపు అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. న్యూజెర్సీలో 1232 మంది మరణించారు. మిచిగాన్, కాలిఫోర్నియా, లూసియానా, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, జార్జియాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఆధునికతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆయా నగరాలన్నీ కళ తప్పాయి.. శ్మశానాలుగా మారుతున్నాయి. క్వారంటైన్ సెంటర్లు, ఐసొలేషన్ వార్డులతో నిండిపోయాయి.
నాలుగు లక్షలను దాటిన పాజిటివ్ కేసులు
అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటింది. ఏ దేశంలోనూ ఇంత భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.. చైనా సహా. పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ను దాటుకున్న పది రోజుల్లోనే నాలుగు అధిగమించడం అక్కడి తీవ్రతను స్పష్టం చేస్తోంది. అమెరికాలో నమోదైన పాజిటివ్ కేసులు 4,00,442కు చేరింది. ఈ వైరస్ బారి నుంచి బయటపడిన వారి సంఖ్య ఆ స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వైట్హౌస్ ప్రతినిధులు చెబుతున్నారు.
Recommended Video