క్వారంటైన్లోని దేశాధినేత్రి: కరోనాపై రోజంతా సమీక్షలు: పాజిటివ్ డాక్టర్తో భేటీ.. ఆ వెంటనే..!
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది.. పరిస్థితి చెయ్యి దాటినట్టే కనిపిస్తోంది. తమ దేశంలో కనీసం 70 శాతం మంది ప్రజలు ఈ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ కొద్దిరోజుల కిందటే సంచలన ప్రకటన చేశారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్. పరిస్థితిని ముందే పసిగట్టారు. దాన్ని నియంత్రించడంలో భాగంగా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, డాక్టర్లతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్లతో కూడిన ప్రతినిధుల బృందాలతో భేటీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఏంజెలా మోర్కెల్ స్వచ్ఛందంగా క్వారంటైన్లోకి వెళ్లారు. సమీక్షా సమావేశాల్లో వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్ వేసిన డాక్టర్కు కరోనా వైరస్ సోకినిట్టు నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా పాజిటివ్గా తేలిన వెంటనే ఏంజెలా మోర్కెల్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆమె అధికార ప్రతినిధి స్టీఫెన్ సీబర్ట్ వెల్లడించారు. న్యుమోకొక్కల్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండటానికి ఏంజెలా మోర్కెల్ వ్యాక్టిన్ వేయించుకున్నారని, దాన్ని వేసిన డాక్టర్ కరోనా వైరస్ పాజిటివ్గా తేలిందని అన్నారు.
దీనితో ఛాన్సలర్.. స్వచ్ఛందంగా క్వారంటైన్లోకి వెళ్లారని తెలిపారు. కొద్ది రోజుల పాటు ఇంట్లో నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తారని చెప్పారు. రోజూ ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహిస్తారని, దీనికోసం ఓ డాక్టర్ల బృందాన్ని నియమించినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి ఆమె సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ వచ్చారని వెల్లడించారు.