ఆరోగ్యమంత్రి, ఆయన భార్యకు కరోనా.. గూఢచారుల బాస్నూ వదలని వైరస్
''మాది ఘనమైన చరిత్ర. ఆనాడు ఫరో రాజులనే ఎదిరించాం. ఈనాడు కరోనాను కట్టడిచేయడం పెద్ద విషయం కాదు''అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు పేరుతో సోషల్ మీడియాలో ఓ మెస్ వైరల్ అయింది. కరనా అమెరికాలోకి ఎంటరైన మొదట్లో ట్రంప్ కూడా వైరస్ ను తేలికగా తీసకుంటూ ఇలాంటి డైలాగులే అన్నట్లు వార్తలొచ్చాయి. వాటి సంగతి పక్కనపెడితే.. మొత్తం 92 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ ను కరోనా గజగజలాడిస్తున్నది.
వైరస్ నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్న ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రినే కరోనా కాటేసింది. దీంతో గత రెండు వారాలుగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన వందలమందిని క్వారంటైన్ కు తరలించాల్సిన పరిస్థితి. ఆరోగ్య మంత్రి లిట్జ్మన్ తోపాటు ఆయన భార్యకు కూడా కొవిడ్-19 అని నిర్ధారణ అయిందని, ప్రస్తుతం వాళ్లిద్దరూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ, చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసింది. కొద్ది రోజుల కిందటే.. ప్రధాని కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగికి వైరస్ సోకడంతో నెతన్యాహు సైతం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ ప్రధానికి వైరస్ సోకలేదని తేలింది.
కరోనా నియంత్రణ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఆరోగ్య మంత్రిని గత రెండువారాల్లో చాలా మంది ప్రముఖులు కలిశారు. వాళ్లలో మోసాద్ చీఫ్ యొస్సి కొహెన్ కూడా ఉన్నారు. ప్రపంచ దేశాల గూఢచార సంస్థలన్నింటిలోకి మేటిగా ఇజ్రాయెలీ మోసాద్ పేరుపొందిన సంగతి తెలిసిందే. కొహెన్ తోపాటు జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) మెయిర్ బెన్ షబ్బత్ కూడా ప్రస్తుతం క్వారంటైన్ కు పరిమితమైపోయారు.
పశ్చిమాసియాలో ఇరాన్, టర్కీ తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా ఇజ్రాయెల్ కొనసాగుతున్నది. గురువారం రాత్రి నాటికి అక్కడ 6,808 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 34 మంది ప్రాణాలు కోల్పోయారు.చికిత్స పొందుతున్నవారిలో మరో 100 మంది పరిస్థితి విషమంగా ఉంది. కరోనా కారణంగా ఇరాన్ లో 3,160 మంది, టర్కీలో 277 మంది చనిపోయారు.