అమెరికాలో నిరసనల్లో మరో ట్విస్ట్- ముప్పు తప్పదంటున్న నిపుణులు....
అమెరికాలో జాత్యహంకారానికి నిరసనగా చెలరేగిన నిరసనలు, ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే అగ్రరాజ్యం కరోనాతో అతలాకుతలమవుతున్న విషయాన్ని కూడా మర్చిపోయి నిరసనలు కొనసాగించడం పట్ల మేథావులు, నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరసన వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదా తెలియదు కానీ భారీగా కరోనా వ్యాప్తి ఖాయమంటున్నారు.
నిరసనలతో ముప్పు....
అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత చెలరేగిన నిరసనలు ఇప్పుడు ఆ దేశానికి మరింత ముప్పుగా పరిణమించబోతున్నాయా అంటే అవునంటున్నారు అక్కడి వైద్య నిపుణులు. ఇప్పటికే కరోనా కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగిన దేశంలో తాజా నిరసనలతో వైరస్ మరింత తీవ్రంగా వ్యాపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం సీడీసీ కూడా ఇదే విషయాన్ని హెచ్చరించింది.
ఆ నగరాల్లో మరింత ఎక్కువగా..
ప్రస్తుతం ఘర్షణలు అధికంగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, మినియాపోలిస్ నగరాల్లో వైరస్ తీవ్రత మరింత ఎక్కువయ్యే ప్రమాదముందని సీడీసీ హెచ్చరిస్తోంది. నిరనసల్లో పాల్గొంటున్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోకపోతే భారీగా ముప్పు వాటిల్లుతుందని సీడీసీ అధికారులు తెలిపారు. న్యూయార్క్ తో పాటు నిరసనలు ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో కనీసం 30 నుంచి 40 వేల మంది వీటిలో పాల్గొంటున్నారు. వీరు మాస్కులు ధరించినా భౌతిక దూరం మాత్రం పాటించడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీడీసీ అంచనా వేస్తోంది.
ట్రంప్ సర్కార్ కు నివేదిక....
నిరసనల్లో పాల్గొంటున్న వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, నిరసనల నుంచి తిరిగొచ్చాక 14 రోజుల పాటు క్వారంటైన్ విధించాలని సీడీసీ ట్రంప్ సర్కారు కు పంపిన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల గవర్నర్లు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓసారి నిరసనలు సద్దుమణిగితే తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో ఉన్నారని తేలిపోతోంది.. దీంతో అమెరికాలోని నిపుణులు, మేథావులు, డాక్టర్లు ముందుకువచ్చి నిరసనకారులను శాంతించాలని కోరుతున్నారు.